కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులైన రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలు నవంబర్ 27, బుధవారం ఉదయం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని కలుసుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని ఆగస్టు 21 న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది. సీబీఐ విచారణ అనంతరం నిందితుడిగా ఉన్న చిదంబరాన్ని జ్యూడిషయల్ కస్టడీ లో భాగంగా తీహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చిదంబరంకు సుప్రీంకోర్టు అక్టోబరు 22న బెయిలు మంజూరు చేసింది.
అయితే మనీలాండరింగ్ కేసులో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అక్టోబర్ 16న తిరిగి చిదంబరాన్ని అదుపులోకి తీసుకోవడంతో బెయిల్ మంజూరైన కూడ తీహార్ జైలులో విచారణ ఖైదీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలు చిదంబరాన్ని పరామర్శించి కొద్దిసేపు ముచ్చటించారు. వారితో పాటుగా చిదంబరం కుమారుడు కార్తీ కూడా ఉన్నారు. మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశి థరూర్, మనీష్ తివారీలు కూడా సోమవారం నాడు తీహార్ జైల్లో చిదంబరాన్ని కలిసి పలు అంశాలపై చర్చించారు.
[subscribe]