శివసేన అధ్యక్షుడు, మహా వికాస్ అఘాడి సీఎం అభ్యర్థి ఉద్ధవ్ థాకరే నవంబర్ 27, బుధవారం ఉదయం గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీని కలిశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఉద్ధవ్ థాకరే, తన భార్య రష్మీతో కలిసి గవర్నర్ నివాసానికి వెళ్లి, ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల మద్ధతు, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఇతర అంశాలపై గవర్నర్తో ఉద్ధవ్ థాకరే చర్చించారని రాజ్ భవన్ వర్గాలు తెలియజేశాయి. మరోవైపు ఈ రోజు మహారాష్ట్ర అసెంబ్లీలో, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది.
ముందుగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యి ఉద్ధవ్ థాకరే ను మహా వికాస్ అఘాడి సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నారు. అనంతరం మూడు పార్టీల ముఖ్యనేతలు బృందంగా వెళ్లి గవర్నర్ కోశ్యారీని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. వీరి కూటమికి 166మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పేర్కొన్నారు. నవంబర్ 28, గురువారం సాయంత్రం 6.40 గంటలకు దాదర్లోని శివాజీపార్క్లో జరగనున్న కార్యక్రమంలో ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. థాకరే కుటుంబం నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న తొలివ్యక్తి ఉద్ధవ్ థాకరేనే కావడం విశేషం. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య థాకరే వారి కుటుంబం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. వర్లి నియోజకవర్గం నుంచి ఆదిత్య థాకరే ఘనవిజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
[subscribe]