రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చ్ 5, గురువారం నాడు ‘ఎస్ బ్యాంక్’ పై తాత్కాలిక నిషేధాన్ని విధించింది. నిర్వహణ లోపాలు, మొండిబాకీలు, నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటునందువలనే ప్రైవేట్ రంగ ఎస్ బ్యాంక్ పై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మార్చి 5 నుంచి ఏప్రిల్ 3 వరకూ ఎస్ బ్యాంకు ఖాతాదారులెవరూ తమ ఖాతాల నుంచి రూ.50,000కు మించి విత్డ్రా చేసుకునేందుకు వీల్లేదని ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఉన్నత విద్య, వివాహం, వైద్యం వంటి అత్యవసర సందర్భాల్లో మాత్రమే ఆధారాలు చూపి ఆర్బీఐ అనుమతితో రూ. 50,000కు మించి విత్డ్రా చేసుకోవడానికి వీలుంటుందని తెలిపారు. తదుపరి ప్రకటన విడుదల చేసేంతవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
మరోవైపు ఎస్ బ్యాంకు బోర్డును కూడా ఆర్బీఐ రద్దు చేసింది. ఎస్బీఐ మాజీ సీఎఫ్వో ప్రశాంత్ కుమార్ను ఎస్ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. ఈ నిర్ణయంతో ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదని ఆర్బీఐ పేర్కొంది. అందరి డిపాజిట్లు భద్రంగానే ఉంటాయని, డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడతామని తెలిపారు. బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్ట నిబంధనల ప్రకారం ఎస్ బ్యాంక్ ను పునరుద్ధరించడం లేదా మరో బ్యాంకులో విలీనం చేసేలా అతి త్వరలోనే ప్రణాళికను రూపొందిస్తామని ఆర్బీఐ ప్రకటించింది. డిపాజిటర్లు ఎక్కువ రోజులు ఇబ్బందులు పడకుండా నిషేధం ముగిసేలోపే తగిన నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ వెల్లడించింది. అదే విధంగా ఎల్ఐసీతో కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎస్ బ్యాంకులో ఉన్న వాటాను కొనుగోలు చేసి టేకోవర్ చేసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తునట్టు సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి, అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.