ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ఉదయం మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతానికి పెంచేందుకు ఎంపీసీ ఏకగ్రీవంగా ఓటు వేసిందని గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. మే నెలలోనే రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో 4.40 శాతానికి చేరుకోగా, తాజాగా 50 బేసిస్ పాయింట్లు పెరగడంతో 4.90 శాతానికి పెరిగింది. దీంతో ప్రస్తుతమున్న వడ్డీ రేట్లను బ్యాంకులు కూడా పెంచే అవకాశం ఉండడంతో, హోమ్, పర్సనల్, వెహికల్ లోన్ తీసుకున్న వినియోగదారులకు, తీసుకునే వారికీ ఈఎంఐ పెరిగే అవకాశముంది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికే రెపో రేట్ పెంచుతున్నట్టు తెలిపారు. యుద్ధం కారణంగా రోజురోజుకూ కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నామని, సప్లై చైన్స్ ను ప్రభావితం చేస్తుందన్నారు. కోవిడ్ మహమ్మారి మరియు యుద్ధం ఉన్నప్పటికీ రికవరీ ఊపందుకుందని, అయితే ద్రవ్యోల్బణం సహన స్థాయికి మించి బాగా పెరిగిందని అన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థల్లో కూడా రికవరీ ప్రక్రియ ప్రభావితమవుతుందని, కానీ దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందన్నారు. ఈ క్రమంలోనే అసాధారణమైన అనుకూలతను క్రమంగా ఉపసంహరించుకోవడం కోసం ఎంపీసీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) మరియు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేట్లు కూడా 50 బేసిస్ పాయింట్లు పెంచబడ్డాయి. దీంతో ఎస్డీఎఫ్ రేటు ఇప్పుడు 4.65 శాతానికి, ఎంఎస్ఎఫ్ రేటు ఇప్పుడు 5.15 శాతానికి పెరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి 7.2 శాతంగా ఉంటుందని, ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని ఎంపీసీ అంచనా వేసింది. ఇక అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు ఇకపై తమ ఖాతాదారులకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను విస్తరించవచ్చని, గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంకులు ఇకపై కమర్షియల్ రియల్ ఎస్టేట్ లేదా రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్లకు రుణాలను ఇవ్వొచ్చని తెలిపారు.
ఆటో డెబిట్ లిమిట్ రూ.15,000కు పెంపు, యూపీఐ ఖాతాలకు క్రెడిట్ కార్స్ లింక్:
మరోవైపు ఓటీపీ అవసరం లేకుండా వినియోగదారులకు ఆటో డెబిట్ లిమిట్ ను రూ.5000 నుంచి రూ.15,000కు పెంచారు. అదేవిధంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా యూపీఐ ఖాతాలకు క్రెడిట్ కార్స్ లింక్/అనుసంధానం చేసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ముందుగా దేశీయ రూపే క్రెడిట్ కార్డ్స్ ను యూపీఐ ఖాతాలకు అనుసంధానం చేసేందుకు అనుమతి ఇస్తామన్నారు. ఇప్పటివరకు యూపీఐ ఖాతాలకు కేవలం డెబిట్ కార్డ్స్ మాత్రమే లింక్ చేసుకునే అవకాశముంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY