గోవాలో విజయానికి బీజేపీ అడుగు దూరంలో నిలిచింది. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు గాను 20 స్థానాల్లో కమలం పార్టీ విజయం సాధించడం ద్వారా అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారం చేపట్టడానికి కావాల్సిన మేజిక్ మార్క్ 21 కాగా, ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులు ఆంటోనియో వాస్, చంద్రకాంత్ షెటీ, అలెక్స్ రెజినాల్డ్లు బీజేపీ పార్టీకి తమ మద్దతు ప్రకటించారు. దీంతో.. అధికారం చేపట్టటం ఇక లాంఛనమే కానుంది. అయితే, గోవాలో హంగ్ రావచ్చని ఎగ్జిట్ పోల్స్ ముందే అంచనా వేసాయి.
2017లో రాష్ట్రంలో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే 13 సీట్లు గెలుచుకున్న బీజేపీ, గోవా ఫార్వర్డ్ పార్టీ మరియు ఎమ్జీపీ మూడు సీట్లు గెలుచుకున్న మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. గడచిన రెండు పర్యాయాలు బీజేపీనే అధికారంలో ఉండటం విశేషం. మూడోసారి కూడా అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ నిశ్చయంగా ఉంది. 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 300 మంది అభ్యర్థులు పోటీ పడగా గోవా లో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మరియు ఆప్ వంటి పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
సాంక్వెలిమ్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మేశ్ సగ్లానీ పై 650 ఓట్ల తేడాతో గెలవటం విశేషం. అలాగే, బీజేపీ దివంగత నేత, మంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ పార్టీతో విభేదించి బయటకు వెళ్లి ఒంటరిగా పోటీ చేశారు. అయితే, బీజేపీ అభ్యర్థి బాబూష్ చేతిలో 700 ఓట్ల తేడాతో పనాజీ స్థానంలో ఓటమి పాలయ్యారు. ఈరోజే గవర్నర్ ని కలుస్తామని.. స్వతంత్రుల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రమోద్ సావంత్ విశ్వాసం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ