దేశం మొత్తం చూపు యూపీపైనే ఉంది. ఆయోధ్య రాములోరి ఆలయం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని కోట్లాది మంది భారతీయులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కేంద్ర, యూపీ ప్రభుత్వాలు రామాలయ ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అటు రామాలయంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు అయింది. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు బాలరాముడి విగ్రహానికి వేదపండితులు ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, ప్రముఖులు ఆయోధ్య రానున్నారు.
అయితే అయోధ్య రామాలయాన్ని ప్రారంభిస్తుండడంతో ఓవైపు ప్రశంసలు వెల్లువెత్తుతుంటే.. మరోవైపు అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రామాలయాన్ని 75 శాతం మాత్రమే నిర్మించారు. ఆలయాన్ని పూర్తిగా నిర్మించకుండా.. ప్రారంభిస్తుండడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. అటు నాలుగు పీఠాధిపతులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. తాము అయోధ్యకు రాబోమని తేల్చిచెప్పారు. నిర్మాణంలో ఉన్న ఆలయంలో విగ్రహ ప్రతిష్ట ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేమని ప్రకటించేశారు. ఇది ఎన్నికల ముందు బీజేపీ ఆడుతున్న డ్రామా అని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా.. బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, మంత్రి తేజ్ ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు అయోధ్యకు రావడం లేదని తన కలలోకి వచ్చి చెప్పారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే నలుగురు శంకరాచార్యుల కలలోకి వచ్చి ఇదే చెప్పారన్న తేజ్ ప్రతాప్.. తాజాగా తన కలలోకి కూడా వచ్చి బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తాను రానని చెప్పినట్లు చెప్పుకొచ్చారు. ఇది ఒక వంచన కార్యక్రమమని రాముడు తనతో చెప్పారని వ్యాఖ్యానించారు.
‘రాముడు నా కలలోకి వచ్చాడు. నన్ను పరామర్శించాడు. ఆ తర్వాతను నేను ఆయోధ్యకు వస్తున్నావా రామా అని ప్రశ్నించారు. కానీ ఆయన రానని.. తనకు ఇష్టం లేదని చెప్పాడు. ఇది ఒక వంచన కార్యక్రమమని అన్నాడు. ఎన్నికల కోసమే బీజేపీ సర్కార్ రామమందిరం నిర్మించిందని చెప్పాడు’ అని మంత్రి తేజ్ ప్రతాప్ చెప్పుకొచ్చారు. రామాలయ ప్రారంభోత్సవం ముంగిట తేజ్ ప్రతాప్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE