కొద్ది రోజులుగా చైనాను ఓ భయంకరమైన లోటు వేధిస్తోంది.కొన్నేళ్లుగా ప్రపంచ జనాభాలో మొదటి ప్లేసులో ఉంటూ వచ్చిన చైనా..ఇప్పుడు జనాభా క్షీణత సమస్యను ఎదుర్కొంటోంది. చైనాను దాటేసిన భారత్.. జనాభా అదుపు కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా.. జనాభాను పెంచుకోవడానికి మాత్రం చైనా అష్టకష్టాలు పడుతోంది. దీనికి తోడు కరోనా తర్వాత అక్కడ యూత్ మనసులో విపరీతమైన మార్పులు వచ్చినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకప్పుడు యంత్రాల్లో పనిచేసిన వాళ్లే ఇప్పుడు రిలాక్స్ మోడ్లో జీవితాన్ని గడపడానికే ఇష్టపడుతున్నారు. అలాగే కొన్నాళ్ల క్రితం ఏ ఇంటిని చూసినా నలుగురు, ముగ్గురు పిల్లలతో కళకళలాడేవి కానీ.. ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఇంకా లేదంటే పెళ్లి వద్దు.. సోలో బ్రతుకే సో బెటరు అనే మూడ్ లోకి వెళ్లిపోతున్న జనాలతోనే నిండిపోతున్నాయి.దీంతో జనాభా వృద్ధి కోసం నానా తంటాలు పడుతున్న ప్రభుత్వం.. రకరకాల ఆఫర్లు ఇస్తూ చైనీయులను ఆకట్టుకుంటోంది. తాజాగా అలాంటి ఆఫర్ జాబితాలోకి స్పెర్మ్ డొనేషన్ పేరు వినిపిస్తోంది.
అవును..కాలేజీ స్టూడెంట్స్.. మీరు స్పెర్మ్ డొనేట్ చేయండి అంటూ స్పెర్మ్ బ్యాంకులు అభ్యర్థిస్తున్నాయి. చైనాలోని స్పెర్మ్ బ్యాంకులు .. ఆ దేశంలో చదువుకునే కాలేజీ విద్యార్థులను ఇలా వేడుకుంటున్నాయి. అయితే మొదటి సారిగా స్పెర్మ్ బ్యాంకుల నుంచి అలాంటి అభ్యర్థన రావడంతో అక్కడివారు కంగుతింటున్నారు. దీంతో ఇదేంటి ఇలా కూడా రిక్వెస్టులు వస్తాయా అంటూ ..అక్కడ సోషల్ మీడియాలో ఈ విషయంపై ట్రోల్స్ మొదలయ్యాయి. యునాన్ హ్యూమన్ స్పెర్మ్ బ్యాంక్ నుంచి ఈ వారంలో తొలిసారిగా చాలామంది స్టూడెంట్స్కు అలాంటి అభ్యర్థన వచ్చింది. చైనా, బీజింగ్లో కూడా చాలా స్పెర్మ్ బ్యాంకుల నుంచి కూడా ఇలాంటి విజ్ఞప్తులను విద్యార్ధులు, యూత్ అందుకున్నారు.
నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ చైనా.. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, చైనా దేశ జనాభాలో చాలా క్షీణత కనిపించింది. 2022లో 8.5 లక్షల జనాభా క్షీణతతో ఉన్నాయని రిపోర్టులు రావడంతో.. ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరిగాయి. ఎందుకంటే 61 ఏళ్లలో చైనాలో ఇలా కనిపించడం ఇదే మొదటిసారి. జనాభా క్షీణత ప్రమాదాన్ని గుర్తించిన చైనా 2015లో ఒక బిడ్డ విధానాన్ని రద్దు చేసింది. అంతేకాదు అప్పటి నుంచి జనాభాను పెంచుకోవడానికి ఇద్దరు పిల్లలను అనుమతించిన ఆ ప్రభుత్వం.. ఆ తర్వాత 2021లో ముగ్గురు పిల్లలు పుట్టొచ్చని చెబుతూ దంపతులకు అనుమతిని ఇచ్చింది. అప్పటి నుంచి రకరకాల ప్రయత్నాలతో యూత్ను, చైనాలోని యువ జంటలను ఆకట్టుకుంటోన్న చైనా.. తొలిసారి ఇలా వీర్యకణాలను దానం చేయాలని అక్కడివారిని అభ్యర్థన చేస్తున్నారు.కాకపోతే ఎవరుపడితే వాళ్లు స్పెర్మ్ ఇవ్వడానికి లేదట. దానికీ కొన్ని కండిషన్లు ఉన్నాయి.
చైనాలోని అండర్ గ్రాడ్యుయేట్లు లేదా గ్రాడ్యుయేట్లు అయిన వాళ్లు వీర్య దానం చేయవచ్చు. అలాగే 20 నుంచి 35 ఏళ్ల వారు మాత్రమే..అది కూడా 165 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఆరోగ్యవంతమైన యువకుల నుంచి మాత్రమే చైనా స్పెర్మ్ బ్యాంకులు వీర్యాన్ని కోరుతున్నారు. ఎందుకంటే పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు..తెలివితేటలతో ఉంటారని స్పెర్మ్ బ్యాంకులు భావిస్తున్నాయి. దీనికితోడు అటువంటి అర్హత కలిగిన వారయితే.. వారి దగ్గర నుంచి 8 నుంచి 12 రెట్లు స్పెర్మ్ పొందబడుతుందని అంచనా వేస్తున్నాయి. అందుకే స్పెర్మ్ డోనర్లకు..ఈ బ్యాంకులు సబ్సిడీ కూడా ఇస్తున్నాయి. రాను చైనాలో జనాభాలో భారీగా తగ్గుదల రావడాన్ని గమనించిన అక్కడి గవర్నమెంట్..చాలా ఆఫర్లు ఇస్తూ దంపతులను బుజ్జగిస్తూ వస్తోంది. కానీ తాజాగా స్పెర్మ్ డొనేషన్ అభ్యర్థనలు పంపడంతో చైనా మరోసారి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది.