తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్సే రాజీనామా చేశారు. సాధారణ ప్రజలను సంయమనం పాటించాలని ఆయన ట్వీట్ చేసిన కొద్దిసేపటికే రాజీనామా చేశారు. దేశంలో ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి పరిష్కారంగా ప్రధాని పదవి నుంచి వైదొలగాలని అధ్యక్షుడు గోట్బయ రాజపక్సే శుక్రవారం ప్రత్యేక సమావేశంలో ప్రధానిని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఇప్పుడు ప్రధానమంత్రి రాజీనామా చేయడంతో.. అధ్యక్షుడు రాజపక్సే అఖిలపక్ష మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి పార్లమెంటులోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని భావిస్తున్నారు.
అయితే సోమవారం ఉదయం కొంతమంది ప్రధానమంత్రి అనుకూలురు రాజపక్సే రాజీనామా చేయవద్దని కోరుతూ ప్రధాని అధికారిక నివాసం టెంపుల్ ట్రీస్ ఎదుట ప్రదర్శన నిర్వహించడం విశేషం. ప్రధానితో భేటీ అనంతరం టెంపుల్ ట్రీస్ దగ్గర ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులతో ఘర్షణకు దిగారు. గాయపడిన 16 మందిని కొలంబో జాతీయ ఆసుపత్రిలో చేర్చారు. దీనిపై శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర స్పందిస్తూ.. “శాంతియుతంగా నిరసన తెలిపే వారిపై దాడి చేయడానికి ముందు మీ కార్యాలయానికి వచ్చిన మీ ‘మద్దతుదారులు’ హింసకు పాల్పడ్డారు” అని రాజపక్సేని ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడం గమనార్హం. మరోవైపు అంతకుముందు, ప్రతిపక్ష పార్టీ సమగి జన బలవేగయ (SJB) దాని నాయకుడు సజిత్ ప్రేమదాస మధ్యంతర ప్రభుత్వంలో ప్రధానమంత్రి పదవిని అంగీకరించదని స్పష్టం చేసింది. ఇంధనం, ఆహారం మరియు ఔషధాల వంటి అవసరమైన సామాగ్రి కొరతకు దారితీసిన విదేశీ మారకద్రవ్యం కొరత కారణంగా శ్రీలంక గత కొన్ని వారాలుగా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ