టీ20 ప్రపంచ కప్-2022 లో భాగంగా రేపు (నవంబర్ 10, గురువారం) మధ్యాహ్నం 1.30 గంటల నుంచి అడిలైడ్ ఓవల్ గ్రౌండ్ లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలక రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. సూపర్-12 రౌండ్లో గ్రూప్-2లో 8 పాయింట్స్ తో మొదటి స్థానంలో నిలిచి భారత్ సెమీస్ కు చేరుకోగా, గ్రూప్-1 లో 7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఇంగ్లాండ్ సెమీస్ కు అర్హత సాధించింది. కాగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సెమీ ఫైనల్స్కు అర్హత సాధించడం ఇది 4వసారి. ఇప్పటివరకు గ్రూప్ స్టేజిలో భారత్ మొత్తం 5 మ్యాచుల్లో అద్భుతంగా రాణించి నాలుగింటిలో విజయం సాధించగా, సౌతాఫ్రికాపై ఓడిపోయింది. ఇక ఇంగ్లాండ్ 5 మ్యాచుల్లో మూడింటిలో విజయం సాధించగా, ఐర్లాండ్ పై పరాజయంతో పాటు ఒక మ్యాచ్ వర్షం వలన రద్దయింది.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తో కీలక సెమీఫైనల్ మ్యాచ్ లో పక్కా ప్రణాళికతో రాణించి, ఫైనల్ కు చేరుకోవాలని భారత్ జట్టు భావిస్తుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్ లో ఉండడం, ఓపెనర్ కేఎల్ చివరి రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసి ఫామ్ అందుకోవడం భారత్ కు సానుకూలాంశంగా ఉంది. అయితే ఇంగ్లాండ్ జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించి విజయంతో ఫైనల్ కు చేరాలంటే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ కూడా అంచనాలకు అనుగుణంగా రాణించాల్సి ఉంది. భారత్ బౌలర్లు భువనేశ్వర్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ మెరుగైన ప్రదర్శన చేస్తుండగా, స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ లు పరుగులు కట్టడి చేస్తూ మంచి ప్రదర్శన చేయాల్సి ఉంది.
ఇక ఇంగ్లాండ్ జట్టులో అలెక్స్ హేల్స్, హ్యారీ బ్రూక్ కీలక ఇన్నింగ్స్ ఆడుతుండగా, కెప్టెన్ జోస్ బట్లర్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ రాణించడంపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇంగ్లాండ్ బౌలింగ్ యూనిట్ సామ్ కుర్రాన్, ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్, మొయిన్ అలీ, మార్క్ ఉడ్ లతో పటిష్టంగా ఉంది. ఓవరాల్ గా జట్ల బలాబలాలు పరిశీలిస్తే భారత్ జట్టు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, ఇంగ్లాండ్ ను తేలికగా తీసుకోకూడదని భారత్ మాజీ ఆటగాళ్లు పేర్కొంటున్నారు.
మరోవైపు మంగళవారం న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి, టీ20 ప్రపంచ కప్-2022 ఫైనల్ కు చేరుకుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ పై సెమీఫైనల్లో భారత్ జట్టు విజయం సాధిస్తే, ఫైనల్ లో పాకిస్తాన్ తో తలపడనుంది. మరోసారి దాయాదుల మధ్య అత్యంత ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్ కు క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే నవంబర్ 13, ఆదివారం జరిగే ఫైనల్లో టీ20 ప్రపంచ కప్-2022 టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయా?, లేదా ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఏదైనా సంచలనం నమోదు కానుందా?, అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
భారత్ జట్టు అంచనా: కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్/దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.
ఇంగ్లాండ్ జట్టు అంచనా: అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, మోయిన్ అలీ, ఫిల్ సాల్ట్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్/డేవిడ్ విల్లీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE