ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 27, మంగళవారం ఉదయం ఉత్తరప్రదేశ్ కు చెందిన పీఎం స్వనిధి (ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి యోజన) పథకం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. కరోనాతో వీధి వ్యాపారుల జీవితాలు ప్రభావితం కావడంతో వారి బ్రతుకుతెరువుకు సంబంధించిన కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించేందుకు సాయపడేలా పీఎం స్వనిధి పథకాన్ని జూన్ 1 న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. వీధి వ్యాపారులు ఈ పథకం కింద సబ్సిడీ రేటుతో రూ.10,000 వరకు పొందుతారు.
ఇప్పటివరకు మొత్తం 24 లక్షలకుపైగా దరఖాస్తులు అందగా, వాటిలో 12 లక్షల దరఖాస్తులకు పైగా అనుమతించి, దాదాపు 5.35 లక్షల రుణాలను అందించారు. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 6 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, వాటిలో నుంచి 3.27 లక్షల దరఖాస్తులను అనుమతించి 1.87 లక్షల రుణాలను అందించారు. రేపు వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ కొందరికి స్వయంగా రుణాలు అందజేసి, వారితో సంభాషించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu