చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడా? ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నుండి రిటైర్ అవ్వాలనుకుంటున్నాడా? ఈ మేరకు అతను తన ట్విట్టర్ ఖాతాలో ఈరోజు పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు అంబటి రాయుడు శనివారం ట్వీట్ చేశాడు. అందులో ఇదే తన చివరి ఐపీఎల్ సీజన్ అని రాయుడు చెప్పాడు. ఇంకా తన ప్రకటనలో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్కు ధన్యవాదాలు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరుకి చెందిన రాయుడు తన ఐపిఎల్ కెరీర్లో ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలుచుకున్న జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.
“ఇది నా చివరి ఐపిఎల్ అని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. నేను 13 సంవత్సరాలుగా 2 గొప్ప జట్లలో భాగమైనందుకు అద్భుతమైన సమయాన్ని కలిగి ఉన్నాను. ఈ అద్భుతమైన ప్రయాణం కోసం ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను” అని రాయుడు తన ట్వీట్లో పేర్కొన్నాడు. అయితే కొద్దిసేపట్లోనే అతను ఆ ట్వీట్ను తొలగించాడు. దీంతో రాయుడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అభిమానులు చర్చించకుంటున్నారు. అయితే అంబటి రిటైర్మెంట్ ప్రకటనపై స్పందించిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్.. రాయుడు ప్రతిభ ఉన్న ఆటగాడని, అతడు మా జట్టుతోనే కొనసాగుతాడని స్పష్టం చేశారు.
రాయుడు 2010లో ముంబై ఇండియన్స్ ద్వారా టోర్నమెంట్లోకి అడుగుపెట్టాడు. 2013 సీజన్లో అన్ని మ్యాచ్లు ఆడాడు. ఆ సీజన్లో ముంబై టైటిల్ దక్కించుకుంది. ఆ తరువాత 2015 మరియు 2017లో కూడా ముంబై టైటిల్ గెలుచుకోవడంలో తన పాత్ర ఉంది. అయితే 2018లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపిఎల్ బరిలోకి దిగాడు. ఎంఎస్ ధోని నేతృత్వంలోని జట్టులో రాయుడు తన ఆటతో పవర్ హిట్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒంటిచేత్తో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. 2018 మరియు 2021లో చెన్నై టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తన దశాబ్దపు ఐపిఎల్ కెరీర్లో రాయుడు.. 30 సగటుతో 4,187 పరుగులు చేశాడు. ఒక సెంచరీ సహా 22 అర్ధ సెంచరీలు చేశాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ