కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీవరకు లాక్డౌన్ విధించడంతో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన పరీక్షలు, పలు విద్యారంగ కార్యక్రమాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరగాల్సిన పరీక్షలు, వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ, పరీక్షలపై నివేదిక కోసం యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ (యూజీసీ) రెండు నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీకి హర్యానా సెంట్రల్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ మరియు యూజీసీ మాజీ సభ్యుడు ఆర్సి కుహాద్ నేతృత్వం వహించారు. ఈ కమిటీ తాజాగా సమర్పించిన నివేదికలో వచ్చే విద్యా సంవత్సరాన్ని ఆగస్టు 1, 2020 నుంచి ప్రారంభించాలని సూచించినట్టు తెలుస్తుంది.
రెండు మరియు మూడవ సంవత్సరంలోకి వెళ్ళే విద్యార్థుల కోసం ఆగస్టు 1 నుండి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని కమిటీ సిఫారసు చేసింది. అలాగే చివరి సెమిస్టర్ పరీక్షలను జూలై నెల మొదటివారంలో నిర్వహించాలని, ఆ తర్వాత ఇతర సెమిస్టర్ల పరీక్షలను నిర్వహించాలని కమిటీ సూచించింది. ప్రాజెక్టు వర్కు డిజర్టేషన్, సిలబస్ పూర్తి, ప్లేస్మెంటు డ్రైవ్ పలు ఇతర కార్యక్రమాలను మే 16 నుంచి మే 31లోపు పూర్తిచేయాలని నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు ఉన్నత విద్యా సంస్థలలో కొత్త విద్యార్థుల మొదటి సంవత్సరం క్లాసులను సెప్టెంబర్ 1 నుండి ప్రారంభించాలని కమిటీ సూచించింది.
అలాగే ఆన్లైన్ విద్యను ప్రోత్సహించడానికి సంబంధించిన సమస్యలను పరిశీలించడానికి ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) వైస్ ఛాన్సలర్ నాగేశ్వర్ రావు అధ్యక్షతన యూజీసీ కమిటీని ఏర్పాటు చేసింది. “అన్ని ఉన్నత విద్యా సంస్థలలో ఆన్లైన్ విధానం తప్పనిసరి కాదు, ఎందుకంటే వారందరికీ ఆ విధమైన మౌలిక సదుపాయాలు లేవు. అయితే అటువంటి మౌలిక సదుపాయాలు ఉన్న సంస్థలు ఆన్లైన్ విద్యను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని” ఈ కమిటీ నివేదికలో పేర్కొంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]