అమెరికా అధ్యక్ష ఎన్నికల అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. నవంబర్ 20, 2020న జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ల గెలుపును అమెరికా కాంగ్రెస్ అధికారికంగా ధ్రువీకరించింది. జో బిడెన్ మొత్తం 306 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను, డోనాల్డ్ ట్రంప్ 232 ఓట్లను గెలుచుకున్నట్టు అమెరికా కాంగ్రెస్ ధ్రువీకరించింది. అనంతరం జనవరి 20 వ తేదీన జో బైడెన్ అమెరికా అధ్యక్షుడవుతారని ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రకటించారు. మరోవైపు జనవరి 20 న క్రమబద్ధమైన అధికారమార్పిడికి సహకరిస్తానని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నట్టు తెలుస్తుంది.
ముందుగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు అమెరికా కాంగ్రెస్ బుధవారం నాడు సమావేశమైన సందర్భంగా అమెరికా క్యాపిటల్ భవనం వద్ద హింస, కాల్పులు చోటుచేసుకున్నాయి. బైడెన్ ఎన్నిక పక్రియను వ్యతిరేకిస్తూ ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్ భవనం(పార్లమెంటు)లోకి దూసుకొచ్చారు. అమెరికా కాంగ్రెస్ సమావేశాన్ని అడ్డుకుని, కిటికీలు, ఫర్నీచర్ ధ్వంసం చేస్తూ వీరంగం సృష్టించారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు, ట్రంప్ మద్దతుదారులు మధ్య ఘర్షణ నేపథ్యంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆందోళనలో ఓ మహిళ సహా నలుగురు మరణించారు. అలాగే 50 కి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ