ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల వరకు 9.10 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నాలుగో దశలో భాగంగా లఖింపూర్ ఖేరీ, లక్నో, రాయ్ బరేలీ, సీతాపూర్, పిలిభిత్, హర్దోయ్, ఉన్నావ్, బందా, ఫతేపూర్ వంటి 9 జిల్లాల్లోని 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం నాడు పోలింగ్ జరుగుతుండగా, అన్ని పార్టీల నుంచి 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ దశలో మొత్తం 2.3మంది ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ పక్రియ కోసం 13,817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర, స్థానిక బలగాలతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలకు థర్మల్ స్కానింగ్ చేస్తూ, హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ-రాష్ట్రీయ లోక్ దళ్ పొత్తు, కాంగ్రెస్, బీఎస్పీ, ఎంఐఎం, ఆప్ పార్టీలు పోటీలో ఉన్నాయి. ఇక ఉత్తర్ ప్రదేశ్ లో ఫిబ్రవరి 27న ఐదో దశ, మార్చి 3న ఆరో దశ, మార్చి 7న ఏడో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఓట్లలెక్కింపు పక్రియను చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ