మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ మెరిసింది. డబ్ల్యూపీఎల్ తొలి టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై ఘనవిజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకూ హోరాహోరీగా సాగిన పోరులో అద్భుత విజయాన్ని అందుకుని డబ్ల్యూపీఎల్ తొలి టైటిల్ను కైవసం చేసుకొంది. బ్రౌబర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించింది. తద్వారా హర్మన్ ప్రీత్ కౌర్ సేన డబ్ల్యూపీఎల్ ఛాంపియన్గా అవతరించింది. కాగా ముంబై బ్యాటర్లలో నటాలి స్కీవర్ బ్రంట్ (55 బంతుల్లో 7 ఫోర్లతో 60 నాటౌట్) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకుంది. ఇక హీలే మాథ్యూస్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ లభించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ 5 ఫోర్లుతో 35 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్గా నిలిచింది. అయితే ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో.. ఒక దశలో 6 పరుగుల తేడాతో 6 వికెట్లు చేజార్చుకొని పీకల్లోతు కష్టాల్లో కురుకుపోయింది. ఈ క్రమంలో శిఖ పాండే (17 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్), రాధ యాదవ్ (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడి విలువైన పరుగులు జోడించారు. ముంబై బౌలర్లలో హీలీ మాథ్యూస్ నాలుగు ఓవర్లలో రెండు మెయిడిన్లు వేసి కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. అలాగే ఆ జట్టు బౌలర్లలో ఇస్సీ వాంగ్ 3, అమెలియా కెర్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.
అనంతరం 132 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై కి శుభారంభమేమి దక్కలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్ యస్తిక భాటియాను(4) రాధ ఔట్ చేసింది. మరి కాసేపటికే మరో ఓపెనర్ హీలీ మ్యాథ్యూస్ను(13) జొనాసెన్ పెవిలియన్ చేర్చింది. దీంతో 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన స్థితిలో కెప్టెన్ హర్మన్తో కలిసి నటాలి స్కీవర్ బ్రంట్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. వీరిద్దరూ మూడో వికెట్72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే మరోపక్క ఢిల్లీ బౌలర్లు కూడా పొదుపుగా బౌలింగ్ చేసి మ్యాచ్ను చివరి ఓవర్ వరకు తీసుకొచ్చారు. 17వ ఓవర్లో హర్మన్ రనౌట్ అవడంతో మూడో వికెట్ పడింది. ఈ సమయంలో ముంబై విజయానికి రెండు ఓవర్లలో 21 పరుగులు అవసరం కాగా.. జోనాసెన్ వేసిన 19వ ఓవర్లో నటాలి స్కీవర్ బ్రంట్ చెలరేగి మూడు ఫోర్లు సహా మొత్తం 16 పరుగులు సాధించడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. దీంతో ముంబై విజయానికి చివరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. తొలి మూడు బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా తొలి టైటిల్ కైవసం చేసుకుని డబ్ల్యూపీఎల్లో చరిత్ర సృష్టించింది. ఇక ఢిల్లీ బౌలర్లలో రాధ యాదవ్, జెస్ జొనాసెన్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
స్కోరు బోర్డు
ఢిల్లీ: లానింగ్ (రనౌట్) 35, షఫాలీ (సి) కెర్ (బి) వోంగ్ 11, క్యాప్సీ (సి) అమన్జోత్ (బి) వోంగ్ 0, జెమీమా (సి) మాథ్యూస్ (బి) వోంగ్ 9, కాప్ (సి) యాస్తిక (బి) కెర్ 18, జొనాసెన్ (సి అండ్ బి) మాథ్యూస్ 2, అరుంధతి (సి) ఇషాక్ (బి) కెర్ 0, శిఖా పాండే (నాటౌట్) 27, మిన్ను (స్టంప్డ్) యాస్తిక (బి) మాథ్యూస్ 1, తానియా (బి) మాథ్యూస్ 0, రాధా యాదవ్ (నాటౌట్) 27; ఎక్స్ట్రాలు: 1; మొత్తం: 20 ఓవర్లలో 131/9.
ముంబై బౌలింగ్: సివర్ బ్రంట్ 4-0-37-0, వోంగ్ 4-0-42-3, ఇషాక్ 4-0-28-0, కెర్ 4-0-18-2, హేలీ మాథ్యూస్ 4-2-5-3.
ముంబై: మాథ్యూస్ (సి) అరుంధతి (బి) జొనాసెన్ 13, యాస్తిక (సి) క్యాప్సీ (బి) రాధ 4, బ్రంట్ (నాటౌట్) 60, హర్మన్ప్రీత్ (రనౌట్) 37, కెర్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు: 6; మొత్తం: 19.3 ఓవర్లలో 134/3.
ఢిల్లీ బౌలింగ్: కాప్ 4-0-22-0, రాధ 4-0-24-1, జొనాసెన్ 4-0-28-1, శిఖ 4-0-23-0, క్యాప్సీ 3.3-0-34-0.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE