భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా అక్టోబర్ 23, 2019న బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పదవి చేపట్టడానికి ముందుగా బెంగాల్ క్రికెట్ అధ్యక్షుడిగా ఉండడం వలన బీసీసీఐ విరామ నిబంధనల ప్రకారం 2020 సెప్టెంబర్ తర్వాత అధ్యక్ష పదవి నుండి దిగిపోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పదవీకాలాన్ని బీసీసీఐ పొడిగించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. డిసెంబర్ 1న ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో గంగూలీ అధ్యక్షతన కొత్త ఆఫీసు-బేరర్స్ తో మొదటి వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో సుప్రీంకోర్టు ఆమోదించిన బీసీసీఐ రాజ్యాంగంలో సవరణల కోసం చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏదైనా అధ్యక్ష పదవిలో రెండోసారి కొనసాగాలంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం మూడేళ్లు విరామం తీసుకోవాలి, ఈ నిబంధనను తొలగించే ప్రతిపాదనకు బీసీసీఐ పాలకవర్గంలో మూడోవంతు ఆమోదించాలి. ఆ తరువాత పాలకవర్గ ప్రతిపాదిత సవరణలకు సుప్రీంకోర్టు కూడ అంగీకరించాల్సి ఉంటుంది. బీసీసీఐ రాజ్యాంగ సవరణకు ఒకవేళ సుప్రీంకోర్టు అనుమతిస్తే అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ మరియు పాలకవర్గం మూడేళ్లు పదవిలో కొనసాగుతారు, మరియు మరో మూడేళ్లు పొడిగింపు అవకాశం కూడ ఉంటుంది.