తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నవంబర్ 11, సోమవారం నాడు జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించమని దాఖలైన పిటిషన్ పై విచారణ జరుపుతూ, అలాంటి అధికార పరిధి హైకోర్టుకు ఎలా ఉందో తెలుపమని పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్యని కోర్టు ఆదేశించింది. ఆర్టీసీని పబ్లిక్ యూటిలిటీ సర్వీస్గా ప్రకటించినందున వలన ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని, కాబట్టి సమ్మె చేస్తున్న వారిపై ఎస్మా ప్రయోగించేలా చర్యలు తీసుకోవాలని న్యాయవాది పీవీ కృష్ణయ్య కోర్టును కోరారు. ప్రజా ప్రయోజన సేవలన్నీ అత్యవసర సేవలు కావని, అత్యవసర సేవలు నిలిచిపోయినప్పుడు మాత్రమే వారిపై ఎస్మా ప్రయోగించడానికి వీలుంటుందని, ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు పేర్కొంది. ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తేనే అత్యవసర సేవల కింద పరిగణనలోకి వస్తుందని హైకోర్టు వివరించింది.
ఇప్పటికే ప్రభుత్వాన్ని కార్మికులతో చర్చలు జరపాలని పలు మార్లు కోరామని, కోర్టుకున్న కొన్ని పరిమితులు దృష్ట్యా ఇలాగే చేయాలని ఆదేశాలు ఇవ్వలేమంటూ తదుపరి విచారణను హైకోర్టు రేపటికీ వాయిదా వేసింది. మరో వైపు 5,100 రూట్లలో ప్రైవేటీకరణకు సంబంధించిన నిర్ణయంపై కోర్టు ఆదేశాల ప్రకారం మంత్రివర్గ తీర్మానాన్ని ప్రభుత్వం హైకోర్టుకు అందజేసింది. సమ్మెపై ఇతర అంశాలను కూడ జోడిస్తూ రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. ఈ సందర్భంగా సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై ఇతర అంశాలపై దాఖలైన పిటిషన్లన్నీ కలిపి విచారణ జరుపుతామని హైకోర్టు తెలియజేసింది.
[subscribe]