భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా ఎంపిక అవ్వడం దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. బీసీసీఐలో సభ్యత్వం కలిగిన రాష్ట్ర క్రికెట్ సంఘాలు అక్టోబర్ 13, ఆదివారం ముంబయిలో సమావేశమయ్యి కీలక పదవుల్లో ఎవరూ ఉండాలనే దానిపై చర్చించి, బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరవ్ గంగూలీ వైపే మొగ్గుచూపినట్టు తెలుస్తుంది. ఇక బోర్డు కోశాధికారిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడైన అరుణ్ ధుమాల్ ఎంపిక అవ్వనున్నారు. అలాగే హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా బీసీసీఐ కార్యదర్శి బాధ్యతలు చేపట్టబోతున్నారు.
అక్టోబర్ 14, సోమవారం బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్లకు ఆఖరితేది కాగా, ఈ నెల 23న బోర్డు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర క్రికెట్ సంఘాల ఆమోదంతో గంగూలీ ఏకగ్రీవంగా అధ్యక్ష పదవిని పొందబోతున్నారు, అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. అదే విధంగా సౌరవ్ గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా 2020 సెప్టెంబర్ వరకు మాత్రమే కొనసాగగలుగుతాడు, ఇప్పటికే బెంగాల్ క్రికెట్ అధ్యక్షుడిగా ఉండడం వలన బీసీసీఐ విరామ నిబంధనల ప్రకారం 2020 సెప్టెంబర్ తర్వాత పదవి నుండి దిగిపోవాల్సి ఉంటుంది.
అక్టోబర్ 12, శనివారం నాడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను, సౌరవ్ గంగూలీ కలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అధ్యక్ష పదవిపై ఊహాగానాలు మొదలయ్యాయి, అయితే శ్రీనివాసన్ వర్గానికి చెందిన బ్రిజేష్ పటేల్ పోటీలో నిలవడంతో అధ్యక్ష పదవికి వీరిద్దరి మధ్య గట్టి పోటీ నెలకుంది. మొదట గంగూలీకి ఐపీఎల్ చైర్మన్ పదవి ఇవ్వాలని భావించగా అతను తిరస్కరించినట్టు సమాచారం. ఆ తరువాత బ్రిజేష్ పటేల్ ను రాష్ట్ర క్రికెట్ సంఘాలు వ్యతిరేకించడంతో గంగూలీకి అధ్యక్షుడిగా అవకాశం దక్కినట్టు తెలుస్తుంది. బ్రిజేష్ పటేల్ ను ఐపీఎల్ చైర్మన్ గా ఎన్నుకునే అవకాశాలు కూడ ఉన్నాయి, సోమవారం నాడు ఈ పదవులపై పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.