- వన్డేల్లో 42వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ
- వన్డే క్రికెట్లో వెస్టిండీస్ తరఫున బ్రియాన్ లారాను(10,348) అధిగమించి, అత్యథిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్(10,353) రికార్డు
ఆగస్టు 11, ఆదివారం నాడు వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో భారత్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారతజట్టు ప్రారంభంలోనే ధావన్(2), రోహిత్ శర్మ(18) వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటినుంచే దూకుడుగా ఆడుతూ స్కోర్ పెంచాడు. నాలుగో స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ కూడ 20 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఐదో స్థానంలో వచ్చిన శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీతో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేసాడు. దూకుడుగా ఆడిన విరాట్ కోహ్లీ 38వ ఓవర్లో సెంచరీ చేసాడు. 125 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్ తో 120 పరుగులు చేసి, జట్టు స్కోర్ 226 వద్ద బ్రాత్వైట్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ 71 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 43 ఓవర్ల వద్ద ఒకసారి వర్షం అంతరాయం కలిగించింది. ఒక దశలో జట్టు స్కోర్ 300 పరుగులు దాటుతుంది అనుకునేలోపల జడేజా, జాదవ్ వికెట్లు వెంటవెంటనే పడడంతో 50 ఓవర్లకి భారతజట్టు ఏడు వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసింది.
అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ ను భారత బౌలర్లు కట్టడి చేసారు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ కొనసాగుతుండగా 13వ ఓవర్లో వర్షం అరగంట పాటు అంతరాయం కల్గించడంతో మ్యాచ్ ను డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 46 ఓవర్లకి కుదించి 270 పరుగుల లక్ష్యంగా నిర్ణయించారు. వెస్టిండీస్ లో లూయిస్(65), పురాన్ (42) పరుగులు చేసి రాణించగా, 42 ఓవర్లకి 210 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు పడగొట్టగా, షమీ, కుల్దీప్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మొదటి వన్డే వర్షము వలన రద్దు అవగా, రెండో వన్డేలో గెలిచి భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక మూడో వన్డే ఈ నెల 14న జరగనుంది.