ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ కు రంగం సిద్దమవుతుంది. ఐపీఎల్-2020 ను సెప్టెంబరు 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహించనున్నట్టు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షెడ్యూల్, ఇతర విధివిధానాలుపై చర్చించడానికి ఆగస్టు 1న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. అదే రోజున ఐపీఎల్ పూర్తీ షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే 51 రోజుల పాటు జరిగే ఈ లీగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆటగాళ్ల ప్రాక్టీస్, భద్రత, వసతి వ్యవహారాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా, ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ హాజరు కానున్నారు.
టీ20 వరల్డ్ కప్ వాయిదా వేస్తునట్టు ఐసీసీ ఇటీవల ప్రకటించడంతో అదే సమయంలో ఐపీఎల్-2020 నిర్వహణకు మార్గం సుగమమైంది. సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో ఐపీఎల్ ప్రారంభించడానికి బీసీసీఐ భారత ప్రభుత్వం అనుమతి కోరింది. యూఏఈలోని అబుదాబి, షార్జా మరియు దుబాయ్ వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలని నిర్ణయించారు. ఐపీఎల్ లో పాల్గొనే 8 జట్లు ఆగస్టు 20 కల్లా యూఏఈకి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టే అవకాశముంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu