ప్రతి సంవత్సరం బెంగుళూరులో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలం ఈసారి కోల్కతాలో నిర్వహించబోతున్నారు. ఐపీఎల్ 13వ సీజన్ కోసం డిసెంబర్ 19న తేదీన ఈ మినీ వేలం ప్రక్రియను నిర్వహించనున్నట్లు సమాచారం. నవంబర్ 14న ట్రేడింగ్ విండో ముగియడంతో 13వ సీజన్ కు డిసెంబర్ నెలలో వేలం పాట నిర్వహించాలని ఐపీఎల్ నిర్వాహకులు భావిస్తున్నారు. దీంతో అన్ని ఐపీఎల్ టీములకు సంబంధించిన ఆటగాళ్ల విడుదల, పరస్పర అంగీకార బదిలీలకు నవంబర్ 14 వరకు అనుమతిస్తున్నారు. 2019 వ సీజన్లో వేలంపాటకు ఒక్కో ఫ్రాంచైజీకి ఆటగాళ్ల కొనుగోలు కోసం గరిష్టంగా రూ.82 కోట్లు కేటాయించగా, డిసెంబర్లో జరిగే 2020 సీజన్ లో మూడు కోట్లకు పెంచి రూ.85 కోట్లకు అనుమతినిచ్చారు.
వీటితో పాటు గత సంవత్సరం వేలంలో మిగిలిన నిధులను కూడ జట్టు యాజమాన్యాలు ఉపయోగించుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద అత్యధికంగా రూ.7.7 కోట్లు మిగిలున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో రూ.7.15 కోట్లు, కోల్కతా నైట్ రైడర్స్ ఖాతాలో రూ.6.05 కోట్లు, సన్ రైజర్స్ వద్ద రూ.5.30 కోట్లు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.3.7 కోట్లు, ముంబయి ఇండియన్స్ రూ.3.55 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ రూ.3.2 కోట్లు మరియు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఖాతాలో తక్కువుగా రూ.1.8 కోట్లు మిగిలి ఉన్నాయి.