ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 5, మంగళవారం నాడు వైద్య, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు, ఆస్పత్రుల్లో నిర్వహించబోయే నాడు–నేడు కార్యక్రమంపై చర్చించారు. ఈ సమీక్షలో విద్యాశాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ, మండల, జడ్పీ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు, 2021-22 విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతుల్లో కూడ ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అదే విధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు లేదా ఉర్దూ ను తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా బోధించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మంగళవారం నాడు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, నవంబరు 14న నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ మొత్తం మూడు దశల్లో కొనసాగుతుందని పేర్కొన్నారు. మొదటి దశలో భాగంగా 15 వేల పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి మెరుగుపరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలాలలో 500 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తామని తెలిపారు. పాఠశాలల్లో అవసరమైన ఫ్యాన్లు, బ్లాక్బోర్డులుతో పాటు ప్రతి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.
[subscribe]