భారత్-వెస్టిండీస్ మధ్య డిసెంబర్ 14,18, 22 తేదీలలో మూడు వన్డే ఇంటర్నేషనల్స్ (వన్డేలు) మ్యాచ్లు జరగనున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్ పై టీ20 సిరీస్ కైవసం చేసుకొని వన్డే సిరీస్ కు సిద్దమవుతున్న భారత్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. భారత్ కీలక పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి గాయం బారిన పడ్డాడు. ప్రపంచకప్ అనంతరం గాయం కారణంగా నాలుగు నెలలు ఆటకు దూరమైన భువనేశ్వర్ కుమార్ ఇటీవల వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లోనే రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే మూడో టీ20 మ్యాచ్ అనంతరం తన పరిస్థితిపై జట్టు యాజమాన్యానికి సమాచారమిచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ తో జరగబోయే వన్డే సిరీస్ నుండి భువనేశ్వర్ కుమార్కు బీసీసీఐ విశ్రాంతి కల్పించింది. అలాగే అతడి స్థానంలో యువ పేసర్ శార్దూర్ ఠాకూర్ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. టీ20 సిరీస్లో బౌలింగ్ తో ఆకట్టుకున్న భువి వన్డే సిరీస్ కు దూరం కావడంతో మరో సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ, యువ పేస్ బౌలర్లు అయినా దీపక్ చాహర్, శార్దూర్ ఠాకూర్ తో కలిసి రాణించాల్సి ఉంటుంది. అలాగే కొంతకాలం తర్వాత భారత్ జట్టులో మళ్ళీ చోటు దక్కించుకున్న శార్దూల్ ఈ అవకాశాన్ని ఏ మేరకు వాడుకుంటాడో వేచి చూడాలి. తొలి వన్డే మ్యాచ్ డిసెంబర్ 15, ఆదివారం నాడు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది.
Home స్పోర్ట్స్
- Advertisement -