దేశంలో క్రీడలకు సంబంధించి అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ నామినేట్ అయ్యాడు. రోహిత్ శర్మతో పాటుగా రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్రా, దివ్యాంగ హైజంపర్, రియో పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు పేర్లను క్రీడా మంత్రిత్వ శాఖ రాజీవ్ ఖేల్రత్న అవార్డుకు సిఫార్సు చేసింది. ముందుగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, దిగ్గజ హాకీ ప్లేయర్ సర్ధార్ సింగ్ తో కూడిన 12 మంది సభ్యుల కమిటీ వీరి పేర్లను ఎంపిక చేసింది.
కాగా ఖేల్రత్న అవార్డు కమిటీ ఇలా నలుగురు పేర్లను నామినేట్ చేయడం ఇది రెండోసారి. గతంలో 2016 సంవత్సరంలో పీవీ సింధు (బ్యాట్మింటన్), సాక్షి మాలిక్ (రెజ్లింగ్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జితూరాయ్ (షూటింగ్) లను నామినేట్ చేయగా, వారు సంయుక్తంగా ఖేల్రత్నను అందుకున్నారు. మరోసారి 2020 సంవత్సరానికి గానూ కమిటీ నలుగురి పేర్లను ఈ అవార్డు కోసం నామినేట్ చేసింది. అయితే భారత క్రికెట్ ఆటగాళ్లలో ఇప్పటికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రమే రాజీవ్ ఖేల్రత్న పురస్కారాన్ని దక్కించుకున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu