గతంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ సుదీర్ఘ కాలం పాటు నెం.1 స్థానంలో ఉన్నాడు. అయితే బాల్ టాంపరింగ్ కారణంగా అనుకోని పరిస్థితుల్లో నిషేధం ఎదురుకుని ఆటకు ఏడాది పాటు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది కాలంలో భారత స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ భారీ పరుగులు సాధింది ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో నెం.1 స్థానానికి ఎగబాకాడు, ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ లో కూడ అదే స్థానంలో కొనసాగుతున్నాడు. కానీ పునరాగమనం తరువాత, ఇపుడు జరుగుతున్న యాషెస్ సిరీస్ లో ఇప్పటీకే స్మిత్ తోలి టెస్టులో రెండు సెంచరీలు, రెండవ టెస్టులో 92 పరుగులు సాధించడంతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు.
922 పాయింట్స్ తో కోహ్లీ నెం.1 స్థానంలో ఉండగా, 913 పాయింట్స్ తో స్టీవ్ స్మిత్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఇద్దరి మధ్య తేడా కేవలం 9 పాయింట్స్ మాత్రమే ఉంది. ఇదే ఫామ్ కొనసాగిస్తే ఇద్దరి మధ్య ర్యాంకింగ్స్ లో గట్టి పోటీ ఉంటుందని క్రికెట్ పరిశీలకులు భావిస్తున్నారు. కేన్ విలియమ్సన్ 887 పాయింట్స్ తో మూడో స్థానంలో ఉన్నాడు, పుజారా 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో పాట్ కమ్మిన్స్ మొదటి స్థానంలో ఉండగా, భారత్ నుంచి జడేజా 5వ, అశ్విన్ 10వ స్థానాల్లో ఉన్నారు. ఇక టీం ర్యాంకింగ్స్ లో భారత జట్టు 113 పాయింట్స్ నెం.1 స్థానంలో కొనసాగుతుంది.