ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో మరో అవినీతి అధికారిని పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం తహసీల్దార్ నాగరాజు భూవ్యవహారంలో ఆగస్టు 14, శుక్రవారం రాత్రి, ఓ వ్యక్తి నుండి ఒక కోటి 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కీసర మండలం, రాంపల్లిలో ఉన్న 28 ఎకరాల భూమికి సంబంధించి పేర్లు మార్చడం, పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం కోసం తహసీల్దార్ నాగరాజు గత కొంత కాలంగా భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఏఎస్రావు నగర్లోని తన ఇంటివద్ద మొదటి విడతగా ఇచ్చే రూ.కోటీ 10 లక్షలను నాగరాజు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నాగరాజుతో పాటుగా ఈ వ్యవహారంతో సంబంధమున్న అంజిరెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనాథ్, రాంపల్లి వీఆర్ఏ సాయిరాజ్ లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా తహసీల్దార్ నాగరాజుపై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కేసులు నమోదయ్యాయి. మరోవైపు సోదాలలో దొరికిన సమాచారంతో నాగరాజు బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu