బోయినపల్లి కిడ్నాప్ కేసులో బుధవారం నాడు ఉదయం మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కిడ్నాప్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని కూడా హైదరాబాద్ టాస్క్పోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా బోయినపల్లి కిడ్నాప్ కేసు వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు వెల్లడించారు. కిడ్నాప్ కు సంబంధించి ప్రాథమిక దర్యాప్తును బట్టి మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రామ్ సహా మరికొందరికి సంబంధం ఉందని చెప్పారు. ఐటీ అధికారులమని చెప్పి ఇళ్లలోకి ప్రవేశించిన 10 మంది దుండగుల బృందం ప్రవీణ్ రావుతో పాటు ఆయన సోదరులు సునీల్, నవీన్ లను కిడ్నాప్ చేశారని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు అందిన వెంటనే 15 బృందాలు రంగంలోకి దిగి గాలింపు చేపట్టాయని, ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజాము సమయంలో నార్సింగి-కోకాపేట ప్రాంతంలో ఆ ముగ్గురిని కిడ్నాపర్లు విడిచిపెట్టినట్టు చెప్పారు.
ఈ కేసులో ఏ1గా ఏవీ సుబ్బారెడ్డిని, ఏ2 భూమా అఖిలప్రియను, ఏ3 గా భార్గవ రామ్ను చేర్చినట్టు సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. వైద్య పరీక్షల నిమిత్తం భూమా అఖిలప్రియను గాంధీ ఆస్పత్రికి తరలించామని, అనంతరం సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. మరోవైపు అరెస్టైన ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ కిడ్నాప్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ కేసులో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ