తెలంగాణ రాష్ట్రంలోని టీఎస్ఎస్పీడీసీఎల్ లో తొలి లైన్ వుమన్ గా బబ్బూరి శిరీష గుర్తింపు పొందారు. తొలిసారిగా లైన్ వుమన్ గా ఉద్యోగం పొందిన శిరీషకు రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బుధవారం నియామక పత్రాన్ని అందించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, టీఎస్ఎస్పీడీసీఎల్ సంస్థ జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ లో భాగంగా దరఖాస్తు చేసుకొని శిరీష లైన్ వుమన్ ఉద్యోగం సాధించినట్టు తెలిపారు. లైన్ వుమన్ గా చరిత్రలో మహిళలకు అవకాశం లేదని, అయితే గత సంవత్సరం తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ ట్రాన్స్ కోలో 200పై చిలుకు లైన్ వుమన్ లను తీసుకున్నామన్నారు. తాజాగా టీఎస్ఎస్పీడీసీఎల్ లో తొలిసారిగా మహిళను లైన్ వుమన్ తీసుకున్నామన్నారు. దేశ చరిత్రలోనే లైన్ వుమన్ గా ఉద్యోగం ఇచ్చిన ఘనత టీఎస్ఎస్పీడీసీఎల్ కే దక్కుతుందన్నారు.
అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంనేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగడునా ప్రయత్నిస్తుందని, కరెంట్ కొనకుండా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంను ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసిందని మంత్రి అన్నారు. అయిన ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కి బొగ్గు కొరత కూడా లేదని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎంకు లోబడి అప్పులు తీసుకోవాలని అనేక ఇబ్బందులు పెడుతుందని, అభివృద్ధిలో ముందు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకొని పోవాలో సీఎం కేసీఆర్ తెలుసునని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా లైన్ వుమన్ గా బబ్బూరి శిరీష మాట్లాడుతూ, ఒక మహిళగా టీఎస్ఎస్పీడీసీఎల్ సంస్థలో లైన్ వుమన్ గా ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉందని, మహిళలు అన్ని రంగాల్లో రాణించవచ్చని అన్నారు. కష్టపడి పని చేసి సంస్థకు పేరు తెస్తానని, తనకు ఉద్యోగ అవకాశం కల్పించిన సంస్థకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి జగదీష్ రెడ్డికి, సీఎండీ రఘుమారెడ్డి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF