రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ సిద్ధమవుతోంది. ఉపఎన్నిక నేపథ్యంలో ‘మునుగోడు సమరభేరి’ పేరుతో బీజేపీ నేడు ( ఆగస్టు 21, ఆదివారం) మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి జరగనున్న ఈ సభకు బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అథితిగా హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఈ సభకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సహా రాష్ట్రస్థాయి బీజేపీ నేతలంతా హాజరుకానున్నారు. మునుగోడు సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరుకానుండడంతో భారీ జన సమీకరణపై బీజేపీ నేతలు ఇప్పటికే దృష్టి సారించి, ఏర్పాట్లు చేశారు. జనసమీకరణ మరియు ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నియోజకవర్గంలో ఒక్కో మండలానికి ఇద్దరు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు.
గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సంచలన విజయాలు సాధించిన బీజేపీ, మునుగోడు కూడా కైవసం చేసుకునేలా ఈ సభ నుంచే సమరశంఖం పూరించేందుకు సిద్ధమైంది. మరోవైపు శనివారం జరిగిన టీఆర్ఎస్ ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై అమిత్ షా సహా, రాష్ట్ర బీజేపీ నేతలు ఎలా స్పందించనున్నారో మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇక మునుగోడు సభలో రాజగోపాల్ రెడ్డితో పాటుగా భారీ సంఖ్యలో పలు పార్టీల ప్రజాప్రతినిధులు కూడా బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తుంది.
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ :
- ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
- అక్కడినుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి అమిత్ షా చేరుకుని, అమ్మవారిని దర్శించుకోనున్నారు.
- అనంతరం సికింద్రాబాద్ సభామూర్తినగర్లో బీజేపీ పార్టీ దళిత కార్యకర్త ఎన్.సత్యనారాయణను ఇంటికి వెళ్లి, ఆయన్ను అమిత్ షా కలుసుకోనున్నారు.
- మధ్యాహ్నం 3.20 గంటలకు రమదా మనోహర్ హోటల్ కు అమిత్షా.
- సాయంత్రం 4 గంటల వరకు అక్కడ రైతు నేతలతో అమిత్ షా సమావేశం.
- సాయంత్రం 4.10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అమిత్ షా బయలుదేరి 4.30 గంటలకు మనుగోడు చేరుకుంటారు.
- సాయంత్రం 4.40-4.55 గంటల మధ్య మునుగోడులో సీఆర్పీఎఫ్ అధికారులతో సమీక్ష.
- సాయంత్రం 5 గంటలకు బీజేపీ మునుగోడు సమరభేరి బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్ షా.
- సభ తరువాత తిరిగి హైదరాబాద్ చేరుకొని రాత్రి 8-9 గంటల మధ్య శంషాబాద్లోని నోవాటెల్లో రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో అమిత్ షా ప్రత్యేక సమావేశం.
- అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY