భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆత్మీయ సందేశం ఇచ్చారు. మన ఒక్క రాష్ట్రం బాగుంటే సరిపోదని, దేశం కూడా బాగుండాలని అన్నారు. అబ్కీ బార్ కిసాన్ సర్కారు నినాదం ఎత్తుకొని దేశం కోసం బయలెల్లిన బీఆర్ఎస్ పార్టీ పైన కేంద్రంలోని బీజేపీ పార్టీ బరితెగింపు దాడులు చేస్తూ, తెలంగాణ ప్రగతిని అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నదన్నారు. బీఆర్ఎస్ ని మరింత బలోపేతం చేసే బాధ్యత మీ భుజ స్కంధాలపైనే వుందని, ధర్మమే జయిస్తుందని పార్టీ శ్రేణులకు ఇచ్చిన ఆత్మీయ సందేశంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
“భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకు నమస్తే…అన్నంతినో అటుకులు తినో..ఉపాసం వుండో 14ఏండ్లు పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం. అధికారం లేకున్నా ఉద్యమ కాలంలో జెండా భుజాన వేసుకొని, లాఠీలకు జైళ్లకు వెరవకుండా రేయింబవళ్లు శ్రమించి పార్టీని కాపాడుకున్న ఘనత కీర్తి గులాబీ సైనికులకే దక్కుతుంది. ప్రజల ఆశీర్వాదం, నిబద్ధత కలిగిన లక్షలాది కార్యకర్తల అసమాన కృషితో అపురూప విజయాలు సాధించి రెండుసార్లు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టింది. ఉద్యమ వీరులుగా ఆనాడు, నవ తెలంగాణ నిర్మాణయోధులుగా ఈనాడు పట్టుదల..అంకితభావంతో పనిచేస్తూ అపూర్వ విజయాలు సాధించిపెట్టింది మీరే.. మీరిచ్చిన బలంతోనే 60 లక్షల సభ్యత్వంతో అజేయమైన శక్తిగా ఎదిగింది బీఆర్ఎస్. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎవ్వరికీ సాధ్యంకాని, ఏకపక్ష విజయాలు సాధిస్తూ రికార్డులను తిరగరాసింది. 21 ఏండ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఆటుపోట్లను తట్టుకొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ గమ్యాలను ముద్దాడిన గట్టిసిపాయి మన పార్టీ. కష్టసుఖాలల్లో కలిసినడుస్తూ, ఒక్కొక్కరు ఒక్కో కేసీఆరై పల్లెల్లో, గల్లీల్లో గులాబీ పతాకాన్ని రెపరెపలాడించి నాకు కొండంత అండగా నిలిచిన మీ రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేను. ఇతరులకు పాలిటిక్స్ అంటే గేమ్. బీఆర్ఎస్ కు మాత్రం టాస్క్. రాజకీయాన్ని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పవిత్ర కర్తవ్యంగా భావించి కొత్తపంథాలో నడుస్తూ కోటి ఆశలతో ఏర్పడ్డ తెలంగాణను కోటి కాంతులు విరజిమ్మే నేలగా తీర్చిదిద్దుకున్నం. కష్టాలు.. కన్నీళ్లు.. కరువులతో అల్లాడిన తెలంగాణ..ఇవ్వాళ పచ్చని పంటలతో చిరునవ్వులతో కళకళలాడుతున్నది. ఆగమైపోయిన తెలంగాణ నేడు కుదుటపడ్డది. కడుపునిండాతిని. కంటినిండా నిద్రపోతున్నది. ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యమై దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. కలలో కూడా ఊహించని కార్యాలను చేపట్టి, అసాధ్యం అనుకున్న పనుల సుసాధ్యం చేసి చూపించి తెలంగాణను దేశానికి నమూనాగా నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అడిగినవీ.. అడగనవీ.. చెప్పినవీ.. చెప్పనవీ ఎన్నో పనులుచేస్తూ, అందరి బంధువుగా నిలిచాం. ఏ వర్గాన్నీ చిన్నబుచ్చలేదు. ఏ ఒక్కరినీ విస్మరించలేదు. మనకు కులం లేదు. మతం లేదు. తెలంగాణ సమాజానికి పొత్తుల సద్దిమూట బీఆర్ఎస్. సంపదను పెంచుతూ, ప్రజలకు పంచుతూ భారతదేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించి ఉజ్వలంగా వెలుగొందుతున్నది తెలంగాణ” అని సీఎం కేసీఆర్ అన్నారు.
“మనం ఇట్లావుంటే, దేశం కథ ఇంకోలెక్కన వుంది. 75 ఏండ్ల స్వతంత్రం తర్వాత కూడా కోట్లాది మందికి తాగడానికి నీళ్లులేవు. తినడానికి తిండిలేదు. నదుల నిండా నీళ్లున్నా, పొలాలకు సాగునీళ్లు రాలేదు. కరెంట్ కష్టాలు తీరలేదు. అన్నీ వనరులూ వసతులూ వుండికూడా భారతదేశం భంగపడుతున్నది. చైనా, సింగపూర్, దక్షిణ కొరియా లాంటి దేశాలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంటే మనం ఇంకా కులాల, మతాల కుమ్ములాటల్లో మునిగిపోయి ముందడుగు వేయలేకపోతున్నం. మన ఒక్క రాష్ట్రం బాగుంటే సరిపోదు. దేశం కూడా బాగుండాలి. దేశాన్ని ఇన్నాళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తెలివి లేదు. విజన్ లేదు. సంకల్పం లేదు. అందుకే దేశానికి కొత్త ఎజెండాను నిర్దేశించి, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు భారత రాష్ట్ర సమితిగా మరో ప్రస్థానాన్ని మొదలుపెట్టినం. ఏదైనా పని మొదలు పెడితే, కడదాకా కాడిదించే అలవాటేలేని ఉక్కు సంకల్పం మనది. అబ్కీ బార్ కిసాన్ సర్కారు నినాదం ఎత్తుకొని దేశం కోసం బయలెల్లిన మన పార్టీ పైన కేంద్రంలోని బీజేపీ పార్టీ బరితెగింపు దాడులు చేస్తూ, తెలంగాణ ప్రగతిని అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది. వేల దాడులు, లక్షల కుట్రలను ఛేదించి నిలిచి గెలిచిన పార్టీ మనది. నాడు మనం భయపడితే తెలంగాణ వచ్చేదా? సాహసమే ఊపిరిగా సాగుతున్న ప్రయాణంలో మీరే నా బలం.. మీరే నా బలగం. తెలంగాణ చైతన్యం తొణికిసలాడే గడ్డ. ప్రజలే కేంద్రం బిందువుగా, వారి సమస్యలే ఇతివృత్తంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకోదు. చిల్లర మల్లర రాజకీయ శక్తులను ఎప్పుడూ ఆదరించదు. తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీది పేగుబంధం. పురిటిగడ్డపైన మరోసారి గులాబీ పార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యం. ఇది ఎన్నికల సంవత్సరం. నిరంతరం ప్రజల్లో వుంటూ పనికిమాలిన పార్టీలు పనికట్టుకొని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలి. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసే బాధ్యత మీ భుజ స్కంధాలపైనే వుంది. ధర్మమే జయిస్తుంది” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE