ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం చోటుచేసుకున్న ఘటనపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. సభలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఘర్షణ కారణంగా ఇరు పార్టీల సభ్యులు ఒకరినొకరు తోసుకోవడం, ఒకరిద్దరు సభ్యులు గాయపడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో ఇలాంటి ఘటనలను సహించేది లేదన్న ఆయన, ఇకపై ఏ సభ్యుడైనా స్పీకర్ పోడియం వద్దకు వస్తే ఆటోమేటిక్ సస్పెన్షన్ కు గురవుతారని ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సోమవారం శాసనసభలో సరికొత్త రూలింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత స్థానంలో ఉన్న స్పీకర్ పైన ప్రతిపక్ష సభ్యులు అమర్యాదగా ప్రవర్తించడం, పేపర్లు చించి పైకి ఎగురవేయడం వంటివి చేశారని తెలిపారు. సీనియర్ సభ్యులే ఇలా చేయడం దురదృష్టకరమని, స్పీకర్ చైర్ వద్దకు వచ్చే హక్కు సభ్యులకు లేదని స్పష్టం చేశారు. ఇక తానేమి గౌతమ బుద్ధుడిని కానన్న స్పీకర్ తమ్మినేని, తనకు సభలో సభ్యులందరూ సమానమేనని పేర్కొన్నారు. సభను సజావుగా నడిపించడం తన కర్తవ్యమని, అలాగే ప్రతి ఒక్క సభ్యుడి హక్కులు పరిరక్షించడం కూడా తన బాధ్యతని వ్యాఖ్యానించారు. కాగా సభా సమయం, ప్రజాధనం వృథా చేయరాదని తాను భావిస్తానని, దీనికి అడ్డు తగిలే సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని స్పీకర్ తమ్మినేని సీతారాం హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE