రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల స్థితిగతులు మెరుగుపర్చి, వారి భవిష్యత్ కు బంగారు బాట వేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లో ఉన్న విక్టోరియా మెమోరియల్ హోమ్ ను సందర్శించి, అక్కడి వసతులను, పిల్లల ఆరోగ్య, విద్యా పరిస్థితులను పరిశీలించారు. హోమ్ లో 58 మంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు. మంత్రులు పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఇంకా ఏమేమి వసతులు కల్పిస్తే బాగుంటుంది, ఇంకా ఏమి చేస్తే సంతోషంగా ఉంటారో చెప్పాలని అడిగారు.
ఈ రాష్ట్ర బిడ్డలుగా అనాథల సంరక్షణ బాధ్యత ప్రభుత్వేమే చూస్తుంది:
మంత్రులు ఇద్దరూ పిల్లలని దగ్గరకు తీసుకొని, వారితో మాట్లాడారు. హోమ్ లో ఎలా ఉంది? భోజనం, చదువు బాగా ఉందా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు లేరని ఇక అనుకోవద్దని ప్రభుత్వమే ఇక తల్లిదండ్రిగా అన్ని బాధ్యతలు తీసుకొని, ఈ రాష్ట్ర బిడ్డలుగా మీ సంరక్షణ చేస్తుందని, ఏ లోటూ లేకుండా చూస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఒక తండ్రి వలె గొప్ప మనసుతో ఆలోచించి విద్య, భోజనం, వసతితో పాటు ఇక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరవాత మంచి భవిష్యత్ అందించాలన్న ఆలోచనతో ఉన్నారని, దేనికి దిగులు పడకుండా బాగా చదువుకోవాలని వారికి ప్రోత్సాహం కల్పించారు.
అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల అనాథలు అయిన వారి బాగోగులు చూసి, వారి బంగారు భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీ వేశారు. పిల్లలు అనాథలు కాకుండా వీరిని రాష్ట్ర ప్రభుత్వ పిల్లలుగా గుర్తించాలన్నారు. ఈ పిల్లలందరికీ సీఎం కేసీఆర్ ప్రకటించే ప్యాకేజీ వారి బంగారు భవిష్యత్ తీర్చిదిద్దే విధంగా ఉంటుంది” అని చెప్పారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చాక అనేక కార్యక్రమాలు చేశారు. ఏమి చేసినా ఆ కార్యక్రమం లోతుల్లోకి వెళ్లి చేస్తారు. అందులో భాగంగానే అనాథల కోసం మంచి కార్యక్రమం చేయాలని నిర్ణయించారు. అనాథ పిల్లలకు అమ్మ, నాన్న ప్రభుత్వమే కావాలని సీఎం కేసీఆర్ ఆలోచన. అనాథల కోసం దేశం మొత్తం గర్వించే విధంగా తెలంగాణలో నూతన విధానం తీసుకురానున్నారు. 120 ఏళ్ల కింద ఏర్పాటు అయిన ఈ విక్టోరియా మెమోరియల్ హోమ్ చాలా మందికి ఆశ్రయం ఇచ్చింది. ఇక్కడ కేజీ టు పీజీ వరకు విద్యావకాశం కావాలని అడిగారు, దీనిని సీఎం దృష్టికి తీసుకెళ్తాం. ఉమెన్ పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఏర్పాటు చేసి అక్కడ చదువుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ