కొత్త ఉత్సాహంతో గెలుపు వైపు దూసుకెళ్దానుకుంటున్న కాంగ్రెస్ దూకుడుకు పాత తరం బ్రేకులు వేస్తోంది. కులాల కుంపట్లు చిచ్చు రేపుతున్నాయి. జాతీయ పార్టీలో సామాజిక న్యాయం లేదన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇప్పటికే తమకు దక్కాల్సిన వాటా మేరకు సీట్లు ఇవ్వాలని బీసీలు కోరుతుంటే.. జనరల్ సీట్లలోనూ అవకాశం ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కమ్మ నేతలు సైతం హైకమాండ్తో అమీతుమీకి సిద్ధమయ్యారు. పది అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు లోక్సభ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అడిగినన్ని సీట్లు ఇవ్వకుంటే ప్లాన్-బీ అమలు చేస్తామంటూ హైకమాండ్కు అల్టిమేటం కూడా జారీ చేశారు.
కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన కమ్మ ఐక్య వేదిక నేతలకు అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు. కమ్మ నేతలతో కేసీ వేణుగోపాల్ చర్చలు జరిపారు. తర్వాత ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేతోనూ కమ్మ ఐక్య వేదిక నేతలు సమావేశమయ్యారు. కానీ, బీసీ నేతలకు మాత్రం హై కమాండ్ అపాయింట్మెంట్ దొరకలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ‘కమ్మ’లు అంటే అంత లోకువనా..? అంటూ కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోన్న కమ్మ నాయకులకు తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. కమ్మ లీడర్లు అంటే అంత లోకువనా..? వారిని అంత తక్కువ అంచనా వేస్తున్నారా..? అని ప్రశ్నించారు. అంటే ఏదో పిల్లికి భిక్షం పెట్టినట్లు నాలుగు బిస్కెట్లు ఏసేస్తే కమ్మ నాయకులు ఊరుకుంటారా..? మీకు సీట్లు, ఆర్థికంగా కూడా చూసుకుంటామని ఇతర పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. ఆ పని ఎందుకు కాంగ్రెస్ చేయలేకపోతుందని రేణుకా చౌదరి ప్రశ్నించారు.
అంతేకాకుండా.. పార్టీ టికెట్ల కేటాయింపుల్లో సామాజిక న్యాయం జరగలేదని, బయట నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని రేణుకా చౌదరి ఆరోపించారు. మొదటి జాబితాపై ఆమె అసంతృప్తితో ఉన్నారు. డబ్బున్న వాళ్లకు కాదు, దమ్మున్నవారికి టికెట్లు ఇవ్వాలన్నారు రేణుకా చౌదరి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని.. కమ్మ కులాన్ని కూడా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాజకీయ పరిణామాల కారణంగా కమ్మ కులస్తులు ఆగ్రహంగా ఉన్నారన్నారు. కమ్మ కులస్తుల మనోభావాల్ని పరిగణలో తీసుకోవాలని హైకమాండ్ను కోరినట్లు రేణుకా చౌదరి తెలిపారు. అయితే ఎన్నికల డేట్ దగ్గరికి వచ్చే కొద్దీ కాంగ్రెస్ని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం.. ఈ నేపథ్యంలోనే రేణుక చౌదరి పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయటం చర్చనీయాంశం అవుతుంది.
ఇదిలాఉంటే.. కాంగ్రెస్ తొలి జాబితాలో బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చామని అధిష్ఠాన పెద్దలు చెబుతుంటే.. ఆ వర్గాల్లో ఇంకా అసంతృప్తి పెల్లుబికుతూనే ఉంది. బీసీలకు పార్లమెంట్కు రెండు చొప్పున 34 సీట్లిస్తామని హామీ ఇచ్చినా.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం అందుకు సిద్ధంగా లేరని పలువురు బీసీ నేతలు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెలుపు గుర్రాలు, సర్వేల పేరుతో బీసీలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. రాహుల్, ఖర్గే వైఖరికి పూర్తి భిన్నంగా రాష్ట్ర నాయకత్వం నడుచుకుంటోందంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని బీసీ లీడర్లు హెచ్చరిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ