తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కరోనా పరిస్థితులు, కరోనా నివారణకు అమలు జరుగుతున్న చర్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం పర్యటిస్తుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం ముందుగా గచ్చిబౌలి లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రిని సందర్శించింది. టిమ్స్ ఆసుపత్రిలో ఐసోలేషన్, ఐసీయూ గదులు మరియు కరోనా చికిత్స కోసం చేసిన ఏర్పాట్లను కేంద్ర బృందం పరిశీలించింది.
అనంతరం గాంధీ ఆసుపత్రి సహా, పలు కంటైన్మెంట్ జోన్లను కేంద్ర బృందం సందర్శించనుంది. క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత బీఆర్కే భవన్లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఈ బృందం భేటీ అయి తాజా పరిస్థితులపై సమీక్ష చేసే అవకాశమున్నట్టు తెలుస్తుంది. అలాగే కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేలా ఈ బృందం కీలక సూచనలు చేయనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu