ఎన్నికలు వస్తున్నాయంటే.. ఓట్ల లెక్కలు.. పార్టీల పొత్తులు తెరపైకి వస్తాయి. ఓ సమయం వచ్చే వరకూ ఓట్ల జాబితాలో లెక్కలు మారుతున్నట్లే.. ఎన్నికలు సమీపించే వరకూ పొత్తుల చిత్రాలు కూడా మారుతూనే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైపోయింది. నామినేషన్ల పర్వం కూడా ఊపందుకుంది. ఇక అభ్యర్థులు ప్రచారంలో గెలుపు కోసం దూసుకెళ్తున్నారు. అధికార పార్టీ బీఆర్ ఎస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినప్పటికీ.. బీజేపీ ఆ విషయంలో వెనుకంజలో ఉంది. అందుకు కారణం జనసేన తో పొత్తుల అంశం కొలిక్కి రాకపోవడమే అన్నది ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని జనసేన – బీజేపీ కలిసి పోటీ చేస్తున్నట్లు తేలిపోయింది. తాజాగా జనసేన అభ్యర్థలు జాబితా కూడా వైరల్ అవుతోంది. ఆ పార్టీకి 9 నుంచి 11 స్థానాలను బీజేపీ కేటాయించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో శేరిలింగంపల్లి, కూకట్పల్లి స్థానాల కోసం జనసేన పట్టుబడుతుండగా.. అందులో ఇప్పటికే కూకట్పల్లి ఓకే అయింది. ఇక శేరిలింగంపల్లి విషయంలో ఇరు పార్టీలూ తర్జన భర్జన పడుతున్నాయి. కమలం పార్టీ తరఫున చేవెళ్ల పార్లమెంట్ లో పోటీకి సిద్ధమవుతున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి శేరిలింగంపల్లి జనసేకు కేటాయిస్తే.. తనకు కష్టమని హైకమాండ్ తో వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. అధికారికంగా కాకపోయినప్పటికీ.. కూకట్ పల్లి, నాంపల్లి, మల్కాజిగిరి, కోదాడ, నాగర్ కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వరావుపేట స్థానాలు జనసేనకు కేటాయించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
జనసేన – బీజేపీ పొత్తులు తెలంగాణలో ఖరారు కావడంతో ఇప్పుడు ఏపీ అంశం తెరపైకి వస్తోంది. అక్కడ తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అప్పటికే ఆయన బీజేపీ కలిసి పయనిస్తున్నారు. కానీ.. ఆ పార్టీ ప్రమేయం లేకుండా టీడీపీ – జనసేన పొత్తు కోసం ప్రకటించేశారు. అంతేకాకుండా.. రెండు పార్టీలు సమన్వయ కమిటీలను కూడా ఏర్పాటు చేశాయి. ఆ కమిటీలు రాజకీయాలపై భేటీ అవుతున్నాయి. ఇదంతా ఓకే కానీ.. మరి ఆ పార్టీలతో బీజేపీ కలుస్తుందా లేదా అనే దానిపై ఇంత వరకూ క్లారిటీ లేదు.
తెలంగాణలో పవన్ తో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ ఏపీ వరకు వచ్చేసరికి నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది. పవన్ మాత్రం తమతో బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నామని ఓ స్టేట్ మెంట్ ఇచ్చి అంతటితో ఆగిపోయారు. అయితే.. తాను ఎన్డీయేలోనే ఉన్నానని పవన్కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో మరి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేతో కలిసి ఉంటుందా? లేక ఒంటరిగా బరిలో పోటీ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తో పవన్ కళ్యాణ్ భేటీ అయిన నేపథ్యంలో ఈ పొత్తుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE