సీఎం కేసీఆర్ నేతృత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిసెంబర్ 13, శుక్రవారం నాడు సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. టిఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టిన సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రం అల్లకల్లోలం అయిందని, కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని విమర్శించారు. రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీసిందని, సీఎం కేసీఆర్ తీరుతో రాష్ట్రం మరో వెనిజులా లా మారే పరిస్థితి వస్తుందనే భయం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, సామాన్య ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో పోలీసు శాఖ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి, కేవలం మంత్రులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకుల కోసమే పనిచేసేలా నియంత్రించారని ఆరోపించారు.
రాష్ట్రంలో సగం మంది రైతులకు ఇంకా రైతుబంధు పథకం అందని పరిస్థితి ఉందని భట్టి విక్రమార్క చెప్పారు. సంవత్సరం దాటిపోయినా నిరుద్యోగ భృతిపై ఊసే లేదని ఎద్దేవా చేశారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ కూడా ప్రకటించలేదని, ఉద్యోగాల భర్తీ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలుతో రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని తీవ్రంగా విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణాలను పక్కనపెట్టి, రీడిజైన్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ తో సంబంధాలు కలిగిఉన్న వారికీ కార్పొరేషన్ పదవులు, క్యాబినెట్ ర్యాంకు పదవులు వరిస్తాయని ఎద్దేవా చేశారు. ఆసిఫాబాద్ నుంచి భద్రాచలం వరకు పోడు భూములు లాక్కుంటూ, గిరిజనులపై దాడులు చేసి కేసులు పెట్టిస్తున్నారన్నారు. పలు పభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వంపై భట్టి విక్రమార్క విమర్శనాస్త్రాలు సంధించారు.
[subscribe]