తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుబంధు నిధులు విడుదల, రాష్ట్రంలో దళిత బంధు అమలు పురోగతి తీరుతెన్నులు, రాష్ట్రవ్యాప్తంగా అమలుకోసం చేపట్టవలసిన చర్యలు, యాసంగి వరి ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ, ఉద్యోగుల జోనల్ పంపిణీ, కరోనా పరిస్థితి మరియు ఒమిక్రాన్ వ్యాప్తి సహా అంశాలపై సమీక్ష జరిపారు.
డిసెంబర్ 28 నుండి రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ:
యాసంగి కోసం రైతుబంధు పంట పెట్టుబడి సాయాన్ని డిసెంబర్ 28వ తేదీ నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రారంభించిన వారం పది రోజుల్లో గతంలో మాదిరిగానే, వరుస క్రమంలో అర్హులైన రైతుల అందరి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతాయని సీఎం తెలిపారు. మరోవైపు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతినేలా నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనబోమని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో ఒక్క కిలో వడ్లు కూడా కొనే పరిస్థితులు లేవని, రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోవడం లేదని సీఎం కేసీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు. ఇది బాధ కలిగించే అంశమే అయినా కేంద్రం మొండి వైఖరివల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితులు తలెత్తాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే రాబోయే వానాకాలం పంటల సాగు కోసం ఏ ఏ పంటలు వేయాలో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రికి అధికారులకు సీఎం ఆదేశించారు. వానాకాలంలో ప్రధానంగా మూడు పంటలపై దృష్టిసారించాలన్నారు. పత్తి, కంది, వరి సాగు పై దృష్టి సారించేలా చూడాలని కలెక్టర్లను, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రైతాంగాన్ని ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగుదిశగా సమాయత్తం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ