రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన అనేక కంపెనీల యాజమాన్యాలతో, పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరిస్తూ వారి సంస్థల విస్తరణకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకునేలా మంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకురాగా, తాజాగా అమెరికాకు చెందిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ డేటా సెంటర్ రంగాలలో ప్రముఖ పెట్టుబడిదారు అయిన ఆరమ్ ఈక్విటీ పార్ట్నర్స్ కీలక పెట్టుబడి ప్రణాళికతో ముందుకొచ్చింది. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ బృందంతో ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఆరమ్ ఈక్విటీ పార్ట్నర్స్ ఒప్పందం చేసుకుంది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భారత్లో టెక్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణ నిలుస్తోందని, ఈ క్రమంలో అనేక అంతర్జాతీయ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో అత్యాధునిక డేటా సెంటర్ల అభివృద్ధి కోసం 50 మిలియన్ల డాలర్లను (రూ.450 కోట్లు) కేటాయించిందని, అదే సమయంలో, తెలంగాణలో డీప్ టెక్ స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి మరో 5 మిలియన్ల (సుమారు రూ.41కోట్లు) మొత్తాన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఐఓటీ, బ్లాక్ చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలు మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్తున్నందున డేటా సెంటర్ డెవలపర్లు ఎడ్జ్ కంప్యూటింగ్పై దృష్టి సారించాలని ఆరమ్ సీఈవో వెంకట్ బుస్సా అభిప్రాయపడ్డారు.
ఇక మరోవైపు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సేవలు, పరిష్కారాల్లో దిగ్గజ సంస్థ గ్రిడ్ డైనమిక్స్ హోల్డింగ్స్ (ఎన్ఏఎస్డీఏక్యూ-జీడీవైఎన్) హైదరాబాద్లోని తమ డెలివరీ కేంద్రాన్ని మరింత విస్తరించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సిలికాన్ వ్యాలీ ప్రధాన కేంద్రంగా 2006లో ఏర్పాటైన ఈ సంస్థ యూఎస్, మెక్సికో, యూరప్తోపాటు భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ఇంకా పర్యావరణ హిత వాహన టెక్నాలజీ అభివృద్ధి కోసం అమెరికాలోని ప్రఖ్యాత కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) రిసెర్చ్ సెంటర్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకొన్నది. అమెరికాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) సేవల సంస్థ ‘స్టేట్ స్ట్రీట్’ హైదరాబాద్లోని తమ శాఖలో సిబ్బంది సంఖ్యను 5 వేలకు పెంచనున్నట్టు ప్రకటించింది.
కాగా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా.. ఇప్పటికే ప్రముఖ అంతర్జాతీయ మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మరియు మెడికల్ డివైజెస్ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్ అయిన మెడ్ట్రానిక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే హెల్త్కేర్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 3ఎం హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (హెచ్ఐఎస్) మరియు హెల్త్కేర్ సపోర్ట్ సర్వీసెస్లో ప్రముఖ ప్రొవైడర్ అయిన ఈసీఎల్ఏటీ హెల్త్ సొల్యూషన్స్ సంయుక్తంగా కరీంనగర్లో కొత్త సెంటర్ను ఏర్పాటు చేయనున్నాయి. వీటితో పాటుగా మరో ప్రతిష్టాత్మక కంపెనీ కూడా రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఫ్రెంచ్-అమెరికన్ ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజం అయిన టెక్నిప్ ఎఫ్ఎంసీ రూ.1250 కోట్లతో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ అండ్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE