తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3, శుక్రవారం నుంచి జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్ లో సమావేశాల ఏర్పాట్లపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, శాసనసభ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, లెజిస్లేటివ్ సెక్రటరీ డా.వి.నరసింహా చార్యులు, పలువురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసుశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశం సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఈనెల 3వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశంలోనే ఆదర్శంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలి. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి గత సమావేశాలలో లాగానే ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలి. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలి. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగులో ఉన్న జవాబులను వెంటనే పంపించాలి. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో అందించాలి. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలి. ప్రతి శాఖ తరుపున ఒక నోడల్ అధికారిని నియమించాలి. శాసనసభ కమిటీలకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం తరపున అందించాలి. శాసనసభ పరిసరాలలో విద్రోహ శక్తులు, సంఘ విద్రోహులు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలి” అని పేర్కొన్నారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అద్భుతమైన పథకాలను అమలు చేస్తోంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వానికి పేరును తీసుకువస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అత్యంత సమర్ధవంతమైనది. లోపల సభ ప్రశాంతంగా జరగాలంటే బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలి. శాసనసభ సమావేశాల కోసం జారీ చేసిన పాస్ లు ఉన్న వారినే ఆవరణలోకి అనుమతించాలి. గతంలోని సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఈసారి కూడా అదేవిధంగా జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి” అని అన్నారు.
ఈ సమావేశానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్) అరవింద కుమార్, జీహెఛ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సీవీ అనంద్, రాచకొండ కమీషనర్ డీఎస్ చౌహన్, సైబరాబాద్ కమీషనర్ స్టిఫేన్ రవీంద్ర, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్ కర్ణాకర్, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE