నల్గొండ టౌన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల జాప్యం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్గొండ అభివృద్ధి పనులపై గురువారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
నల్గొండ అభివృద్ధి పనుల పురోగతి:
గతంలో ఆదేశించిన మేరకు ఏయే పనులు ఎంతవరకు వచ్చాయని సీఎం కేసీఆర్ ఆరా తీశారు. నల్గొండ టౌన్ లో అత్యాధునిక హంగులతో, ఆహ్లాదకరమైన రీతిలో ‘నల్గొండ కళాభారతి’ సాంస్కృతిక కేంద్రాన్ని 2000 మంది సామర్థ్యంతో తీర్చిదిద్దాలని అన్నారు. పానగల్లు ఉదయ సముద్రం ట్యాంక్ బండ్ ను పచ్చదనంతో సుందరీకరించాలన్నారు. నల్గొండ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు సెలవుల్లో వచ్చి కుటుంబ సభ్యులు, పిల్లలతో ఆహ్లాదంగా గడిపేలా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్టుల నుంచి డిజైన్ లు తెప్పించుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఇప్పటికే ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను సీఎం పర్యవేక్షించారు. ఫోటోలు నివేదికల ద్వారా పనుల పురోగతిని సీఎం పరిశీలించారు.
నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఇతర అధికారులు సీఎంకు పనుల పురోగతి వివరించారు. కుటుంబంతో కలసి మార్కెట్ కు వచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి, వారికి రక్షణతో కూడిన పచ్చని పార్కు, ఆటస్థలంతో కూడిన చిల్డ్రన్ కేజ్ ను ఏర్పాటు చేయాలనీ సీఎం అన్నారు. నల్గొండ టౌన్ లో వీలైన చోటల్లా అర్బన్ పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో పచ్చదనం, నర్సరీల గురించి సీఎం ఆరా తీశారు. విరివిగా మొక్కలు నాటడంతో పాటు, రహదారుల విస్తరణ, తదితర కారణాలతో తొలగిస్తున్న పెద్ద పెద్ద వృక్షాలను ట్రాన్స్ లొకేషన్ చేస్తున్నామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సీఎంకు వివరించారు.
నాగార్జునసాగర్ అభివృద్ధిపై ఆరా:
అదే సమయంలో నాగార్జున సాగర్ అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. సాగర్ తో పాటు ఆలియా, నందికొండ మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతి గురించి ఎమ్మెల్యే భగత్ ను సీఎం ఆరా తీయగా, వీటికి సంబంధించి టెండర్లు ఈ మధ్యే పూర్తియిన విషయాన్ని అధికారులు సీఎంకు తెలిపారు. వీటికి సంబంధించిన నిధులు మంజూరై చాలా రోజులయ్యాయని, పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ఇదే సందర్భంలో నల్గొండ మర్రిగూడ బైపాస్ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్, నల్గొండలో క్లాక్ టవర్ జంక్షన్ వద్ద ఆర్ ఎండ్ బి గెస్ట్ హౌస్, సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్ అండ్ బి ఆఫీస్ ల నిర్మాణాలను సీఎం మంజూరు చేశారు. సమీక్షా సమావేశం నుండి రోడ్లు భవనాలు శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఫోన్ చేసి, నిర్మాణానికి సంబంధించిన జీఓలు జారీ చేయాలన్నారు. ఆరు నెలల్లోపు వాటికి సంబంధించిన నిర్మాణ పనులు పూర్తి కావాలన్నారు.
అదే విధంగా ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయ నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సిందిగా కార్యదర్శి స్మితా సబర్వాల్ కు ఫోన్ లో సీఎం ఆదేశించారు. మిర్యాలగూడలో కోర్టు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, నోముల భగత్, ఎమ్మెల్సీ కోటి రెడ్డి, నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ మందాడి సైది రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ముందుగా నార్కట్ పల్లిలో జరిగిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి దివంగత నర్సింహ దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. శోకతప్తులైన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక ప్రజలను సీఎం కేసీఆర్ పలకరించారు. అనంతరం నల్గొండ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ