ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకున్న సీఎం కేసీఆర్, వచ్చి రాగానే ప్రగతి భవన్లో ఆర్టీసీ సమ్మెపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. చర్చలు జరుపుతున్న కూడ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడంతో వారి తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికులతో గత మూడు రోజులుగా జరిపిన చర్చల వివరాలను సీనియర్ ఐఏఎస్ అధికారుల త్రిసభ్య కమిటీ సీఎంకు వివరించారు. కమిటీ వివరణ అనంతరం సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల్లోపు ఆయా డిపోల్లో రిపోర్ట్ చేసిన కార్మికులే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబడతారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆలోపు రిపోర్ట్ చేయకపోతే వారంతా స్వచ్ఛందంగా తమ ఉద్యోగాలు వదులుకుంటున్నట్లుగా గుర్తించాల్సి వస్తుందని అధికారులను ఆదేశించారు. విధుల్లో చేరి, బాధ్యతలు నిర్వహించే కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని పేరొన్నారు.
ఇకపై కార్మిక సంఘాల నేతలతో ఎటువంటి చర్చలు జరుపవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చర్చల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని రద్దు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సంఘాల ఉచ్చులో పడి ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని కార్మికులను కోరారు. ఆర్టీసీని కాపాడడానికి ప్రభుత్వం ఎంతో చేసిందని, ఇకపై ఎలాంటి చర్చలు ఉండబోవని స్పష్టం చేసింది. ఈ సమీక్షా సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె..జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సీనియర్ అధికారులు సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, అడిషనల్ డిజిపి జితేందర్, పార్లమెంటు సభ్యులు కె.కేశవ రావు, నామా నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
[subscribe]