తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం నివాళులు అర్పించారు. నేడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. దొడ్డి కొమురయ్య అమరత్వం అందించిన చైతన్య స్ఫూర్తి.. మలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ కొనసాగిందని, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన శాంతియుత పోరాటంలో సబ్బండ వర్గాలు తమ వంతుగా ఉద్యమించాయని, ఈ క్రమంలో తమ ఆకాంక్షలను చాటడంలో దొడ్డి కొమరయ్య స్ఫూర్తి ఎంతో ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇక కొమురయ్య కుల వృత్తిదారులైన గొల్ల కుర్మల అభివృద్ధి కోసం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అమరుల సంస్మరణార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమర జ్యోతి త్వరలో ప్రారంభం కానున్నదని చెప్పారు. ఇక దొడ్డి కొమురయ్య ప్రాణ త్యాగానికి గుర్తుగా ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఘన నివాళులర్పిస్తున్నదని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
కాగా దొడ్డి కొమురయ్య జయంతి (ఏప్రిల్ 3న) మరియు వర్ధంతిని (జూలై 4న) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రజా విప్లవ ఉద్యమం (1940-51)లోని 4,000 మంది కమ్యూనిస్ట్ మరియు రైతు విప్లవకారులలో దొడ్డి కొమురయ్య ప్రముఖుడు. అప్పటి నల్గొండ జిల్లా (ప్రస్తుతం వరంగల్ జిల్లా)లోని కడవెండి గ్రామానికి చెందిన పేద రైతు మరియు గొర్రెల కాపరి కుటుంబానికి చెందిన కుటుంబంలో జన్మించాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో నాటి నిజాం సైన్యంతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా తెలంగాణ ప్రజల విప్లవోద్యమంలో కొమురయ్య బలిదానం ఒక కీలక మలుపుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వారి పోరాటాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE