మనదేశ స్వాతంత్య్ర పోరాటాన్ని గాంధీకి ముందు, గాంధీ తర్వాత అనే విశ్లేషణ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఎగురవేసి “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” వేడుకలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, వరంగల్ లో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ధన్యవాదములు తెలిపారు. గాంధీజీ రాక ముందు కూడా అనేక రూపాల్లో ఉద్యమం జరిగిందని, మహాత్మా గాంధీ ప్రవేశించిన తర్వాతనే స్వాతంత్ర ఉద్యమం ప్రజా బాహుళ్యంలోకి వెళ్లి, ఉధృత మైనట్లు తెలిపారు.
అహింస, శాంతియుత పద్దతిలో చేసిన స్వాతంత్య్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. గాంధీ ఎంచుకున్న శాంతియుత పోరాట విధానం కొంతమందికి నచ్చలేదు. కానీ శాంతియుత పోరాటం వల్లనే దేశానికి స్వాతంత్రం లభించింది. మానవ హక్కులకై పోరాడిన మార్టిన్ లూధర్ కింగ్ కు స్ఫూర్తి కలిగించింది. బ్రిటిష్ పాలకులు విధించిన “ఉప్పు పన్ను” పై వ్యతిరేకత నెలకొన్నప్పటికి గాంధీజీ చేపట్టిన “ఉప్పు సత్యాగ్రహం” స్వాతంత్య్ర ఉద్యమానికి మైలు రాయిగా నిలిచింది. గాంధీజీ 1930 మార్చి 12న శాసనోళ్లంఘన కు పిలుపునిచ్చి, సబర్మతి నుండి దండి వరకు 384 కిలోమీటర్లు దూరం 24 రోజుల పాటు ప్రయాణించి, మార్గంలో ప్రజలను చైతన్యపరిచారు. 79 మందితో ప్రారంభమైన ఈ యాత్ర, దండిలో ఉప్పును చేతిలోకి తీసుకుని శాసనోళ్లంఘన ప్రకటన చేసే సమయానికి 70 వేల మందికి జమ అయ్యారు. వెల్లువలా ప్రజలు తరలి వచ్చారు. బ్రిటిష్ వైశ్రాయి అనుమానాలను ఆదిగమించి, ఆత్మ నిర్భరం, పట్టుదల, కర్తవ్య దీక్షతో ఉప్పు చట్టాలను ఉల్లంఘిoచి, స్వాతంత్ర ఉద్యమమును దేశ వ్యాప్తం చేశారు.
దండి యాత్రలో గాంధీతో పాటు మన హైదరాబాద్ ముద్దుబిడ్డ సరోజినీ నాయుడు పాల్గొన్నారు. లక్షలాదిమంది ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీని మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా టైం మ్యాగజైన్ ప్రకటించింది. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఉద్యమమిది. గాంధీ పిలుపుకు ప్రజల నుండి వచ్చిన స్పందనకు బయపడిన బ్రిటిష్ ప్రభుత్వం గాంధీని అరెస్టు చేసి, ఎరవాడ జైలులో పెట్టింది. రౌండ్ టేబుల్ సమావేశము జరిపింది. శాసనోళ్లంఘన ఉద్యమంలో సరిహద్దు గాంధీగా గుర్తింపు పొందిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పాల్గొన్నారు. ఎందరో మహనీయులు తమ ఆస్తులు, ప్రాణాలు కోల్పోయారు.
స్వాతంత్య్ర ఉద్యమ ఘట్టాలను, వాటి ప్రాధాన్యతను నేటి తరం విద్యార్ధులు, యువతకు అవగాహన కల్పించుటకై 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల, కళాశాలలలో వ్యాస రచన, వక్రుత్వ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించుటకు ప్రభుత్వ సలహాదారు కెవి రమణచారి అధ్యక్షులుగా కమిటీని నియమించినట్లు తెలిపారు. ఈ వేడుకలు నిర్వహణకు షెడ్యూలు రూపొందించాలని కెవి రమణాచారికి సీఎం కేసీఆర్ సూచించారు. ఈ వేడుకల్లో రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. మూడు రంగుల బెలూన్ లను సీఎం కేసీఆర్ ఎగురవేశారు. రాష్టంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలకు ప్రభుత్వం రూ. 25 కోట్లు మంజూరు చేసింది. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ