తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు (మే 18, బుధవారం) పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరుగనుంది. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, లోకల్ బాడీ కలెక్టర్లు, అన్ని జిల్లాల డీపీఓలు, రాష్ట్ర స్థాయి అటవీశాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు తదితర సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో పలు పట్టణాల్లో నిర్మిస్తున్న సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణాలు, గ్రామాల్లో ఇంకా పెండింగ్ లో ఉన్న వైకుంఠధామాలు, ప్రకృతివనాల ఏర్పాటుపై కూడా సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో కొనసాగుతున్న యాసంగి సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియపై కూడా జిల్లాల వారీగా ఎంతమేర సేకరించారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయనే అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష జరపనున్నట్టు తెలుస్తుంది. అలాగే హరితహారం కార్యక్రమం, వచ్చే సీజన్ లో రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు విధానం, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై కలెక్టర్లు, ఇతర అధికారులకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేయనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF