భారీ వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్దితులపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలసి గురువారం నాడు బిఆర్కెఆర్ భవన్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాలు తగ్గడం వలన జీహెచ్ఎంసీ లోని పలు ప్రాంతాలలో వర్షపు నీరు తగ్గడం ప్రారంభమైనదని, తదుపరిగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. వర్షాల అనంతరం వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేలా వైద్యశాఖను సంసిద్ధం చేయాలని, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో 104 వాహనాలు, వైద్య సిబ్బందితో కూడిన టీమ్ లను రంగంలోకి దించాలన్నారు. వైద్య అధికారులు వేడి చేసి చల్లార్చిన నీటిని త్రాగేలా ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి కేటిఆర్ అన్నారు.
వైద్య శాఖ ద్వారా వర్షాల వలన వచ్చే వ్యాధుల నివారణపై తగు మార్గ దర్శకాలను జారీ చేయాలన్నారు. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని మంత్రి ఆదేశించారు. వైద్య, మునిసిపల్, మెట్రో వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ తదితర అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలలో స్ప్రేయింగ్ ను విస్త్రృతంగా చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 64 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి 45000 మందిని తరలించి వారిని ఆహారాన్ని అందించామన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారాన్ని అందించే చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. చలి తీవ్రత పేరిగే అవకాశం వున్నదున్న వారికి దుప్పట్లు అందించేలా చూడాలని కోరారు.
శిధిలావస్థలో ఉన్న భవనాల, నిర్మాణంలో ఉన్న భవనాలను తనిఖీ చేసి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలలో ప్రజలను తరలించేడానికి చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే పోలీసుల సహకారంతో ప్రజలను తరలించాలన్నారు. జీహెచ్ఎంసీలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మత్తులు నిర్వహించి రవాణాకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటిఆర్ ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu