తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్వరలో జాతీయ పార్టీ పెట్టనున్నారా? దీనిపై ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రులు, ఫ్లోర్ లీడర్స్, సీనియర్ టీఆర్ఎస్ నేతలతో సుదీర్ఘంగా 5 గంటలకు పైగా జరిగిన సమావేశంలో కొత్త పార్టీ పెట్టడం ద్వారా జాతీయ స్థాయికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు సీఎం కేసీఆర్ వారికి తెలియజేశారని సమాచారం. ఈ ప్రతిపాదనకు టీఆర్ఎస్ అగ్రనేతలందరూ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఒకవైపు రాష్ట్ర పాలనా పగ్గాలను కొనసాగిస్తూనే, జాతీయ స్థాయి రాజకీయ పార్టీని తేవడం ద్వారా బిజెపిపై తన పోరాటాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అయితే పార్టీకి ఏ పేరు పెట్టాలన్నదానిపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. వీటిలో ప్రధానంగా.. ‘భారత్ రాష్ట్రీయ సమితి’ (BRS) లేదా ‘నవ భారత్ పార్టీ’ (NBP) అనే పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ఎక్కువమంది నేతలు ‘భారత్ రాష్ట్రీయ సమితి’ పేరుకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. జూన్ 19 లోపు టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశమవుతుందని, అక్కడ కేసీఆర్ తన ప్రణాళికలను అధికారికంగా ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. ఈ క్రమంలో జూన్ నెలాఖరున ఢిల్లీలో ఈ మేరకు కొత్త పార్టీని ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఈ సమావేశంలో త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల గురించి కూడా చర్చించారని తెలిపాయి. బీజేపీ అభ్యర్థిని ఓడించే దిశగా దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే సీఎం కేసీఆర్ కొత్త పార్టీకి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ