అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం ఫిబ్రవరి 25, మంగళవారం రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విందు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి భవన్ లో జరిగే ఈ విందు కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి, రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు హాజరుకానున్నారు. మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ దంపతులతోపాటు ఆయన కూతురు ఇవాంకకు కూడా సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కానుకలు అందించనున్నట్టు తెలుస్తుంది. ట్రంప్కు పోచంపల్లి శాలువాకప్పి చార్మినార్ మెమెంటో అందించనున్నారు. అలాగే మెలానియా ట్రంప్, ఇవాంకలకు పోచంపల్లి, గద్వాల చీరలను సీఎం కేసీఆర్ బహూకరించనున్నారు.