గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన జాస్తి కృష్ణ కిషోర్ అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ పై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) లో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణ కిషోర్ పై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను రద్దు చేస్తునట్టుగా ఫిబ్రవరి 25, మంగళవారం నాడు క్యాట్ ప్రకటించింది. అలాగే కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు కృష్ణ కిశోర్కు క్యాట్ అనుమతి ఇచ్చింది. అతనిపై నమోదైన కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకెళ్లొచ్చని క్యాట్ స్పష్టం చేసింది.
ముందుగా ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా కృష్ణ కిశోర్ పనిచేసిన సమయంలో జరిగిన అక్రమాలపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీఐడీ, ఏసీబీలకు ఆదేశాలు జారీ చేస్తూ అతనిపై సస్పెన్షన్ విధించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదుకావడంతో, ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే విచారణ పూర్తయ్యే వరకు కృష్ణ కిశోర్ అమరావతి విడిచి వెళ్లకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ కృష్ణ కిశోర్ క్యాట్ను ఆశ్రయించారు. ఈ అంశంపై పలు దశలుగా విచారణ చేపట్టిన క్యాట్, ఈ రోజు సస్పెన్షన్ రద్దు చేస్తూ తుది తీర్పును వెల్లడించింది.
[subscribe]