ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ ఈవో స్వామివారి ప్రసాదంను సీఎంకు అందజేశారు. బాలాలయంలో లక్ష్మీనారసింహుడికి సీఎం కేసీఆర్ పూజలు చేశారు. అర్చకులు సీఎంకు ఆశీర్వచనం అందజేశారు.
అనంతరం దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పరిసరాలను కలియ తిరుగుతూ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధానాలయం, గర్భగుడిని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పరిశీలించారు. కళ్యాణ కట్ట, పుష్కరిణి నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం మంత్రులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. సుదర్శన యాగం తలపెట్టిన యాగ స్థలాన్ని 75 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించనున్న యాగశాల ఏర్పాట్లను పరిశీలించారు. అన్నదాన సత్రాలు, ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణాలను పరిశీలించారు. పుష్కరిణిలో భక్తులు మునిగి వందన కార్యక్రమాలు ఆచరించిన తర్వాత స్నానం చేసేందుకు పురుషులకు, స్త్రీలకు విడివిడిగా స్నానపు గదుల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. వ్రత మండపాల నిర్మాణం, దీక్షాపరుల మండపాలను సీఎం పరిశీలించారు. అలాగే ఆలయ నిర్మాణం తుది దశ పనులు, సుదర్శన యాగం నిర్వహణ కోసం ఏర్పాట్లుపై సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సునీత మహేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, కలెక్టర్ తదితరులున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ