దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి ధీటైన ప్రత్యామ్నాయంగా నిలవడంకోసం అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడంలేదు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ క్రమంలో.. త్వరలోనే జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ గెలవాలని కోరుకుంటున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. కోల్కతాలో సోమవారంనాడు మీడియాతో ఆమె మాట్లాడారు. సమాజ్వాదీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్కు ప్రజలు మద్దతిస్తే, అఖిలేష్ ఈ ఎన్నికల్లో గెలవడం పెద్ద కష్టమేం కాదని మమత అన్నారు. అయితే, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకే తమ మద్దతు ఉంటుదని ఇప్పటికే మమతా బెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, 2024 లోక్సభ ఎన్నికల్లో మాత్రం యూపీలో తన పార్టీ టీఎంసీ తప్పక పోటీ చేస్తుందని ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే.. ప్రస్తుత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి మద్దతు ప్రకటించడమే కాక తనవంతు సాయంగా ప్రచారం కోసం సోమ, మంగళవారాల్లో రెండ్రోజుల పాటు మమతా బెనర్జీ యూపీలో పర్యటించనున్నారు. ఈరోజు (సోమవారం) సాయంత్రం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కలిసి సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె పాల్గొంటారు. ఈ సందర్భంగా.. సమాజ్వాదీ పార్టీకి సంపూర్ణ మద్దతివ్వాలని మమతా బెనర్జీ ఉత్తరప్రదేశ్ ప్రజలను కోరనున్నారు. యూపీలో తొలి విడత పోలింగ్ ఈనెల 10న జరుగనున్న నేపథ్యంలో మమతా బెనర్జీ యూపీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకోనుంది. 403 సభ్యుల యూపీ అసెంబ్లీకి ఏడు విడతల్లో పోలింగ్ జరుగనుంది. మార్చి 7వ తేదీతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మార్చి 10న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ